
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్.. భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే సంగతి తెలిసిందే. భారతీయ సినిమాల్లో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్న ఈయన.. కమర్షియాల్టికు పెద్ద పీట వేస్తూనే మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలను అందిస్తూంటారు. దాదాపు ఆయన సినిమాలు అన్నీ భారీ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ను అందుకున్నాయి. ప్రస్తుతం కమల్హాసన్తో భారతీయుడు 2 తెరకెక్కించారు. అలాగే రామ్చరణ్తో ఆర్సీ 15 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాల తర్వాత ఆయన ఏకంగా రూ. 1000 కోట్ల బడ్జెట్తో భారీ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. ఆ వివరాలను ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు.
కమల్ హాసన్ (Kamal Haasan)హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ఈ రోజు( శుక్రవారం) బాక్సాఫీసు ముందుకు వచ్చింది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’కి సీక్వెల్ ఇది. సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్ కీలక పాత్రధారులు. తొలి భాగం కథ ఒక రాష్ట్రం చుట్టూనే తిరగ్గా.. పార్ట్ 2 కథ పలు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి చెప్పుకొచ్చారు.
శంకర్ చెప్పిన దాని ప్రకారం ఓ చారిత్రక తమిళ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఆ నవల పేరు ‘వెల్పరి’. కోవిడ్ టైమ్ లో తాను ఆ నవలను చదివానని,తనకు తెగ నచ్చేసిందని శంకర్ చెప్పారు. ఆ తర్వాత ఆ నవల రైట్స్ తీసుకుని స్క్రీన్ ప్లే రాసుకున్నానని అన్నారు. స్క్రీన్ ప్లే చాలా బాగా వచ్చిందని, మూడు పార్ట్ లుగా ఈ సినిమా రూపొందించాలని చెప్పుకొచ్చారు.
తమిళ ఎపిక్ గా నవల ‘వెల్పరి’ఇప్పటికే తమిళనాట భారీగా సక్సెస్ అయ్యింది. సు.వెంకటేశన్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును దక్కించుకుంది. ఈ నవల తమిళ చరిత్ర ఆధారంగా రాయబడ్డది. తమిళ ఆనంద వికటన్ పత్రికలో ఈ నవల 100 వారాలు పాటు వచ్చింది. సీరియల్ గా వచ్చేటప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. 2019 లో పుస్తకంగా వచ్చింది. ఈ పుస్తకం కోసం రచయిత చాలా ప్రాంతాలు తిరిగి రీసెర్చ్ చేసారు.
ఈ నవల ముఖ్యంగా ఓ ట్రైబల్ రాజు చుట్టూ తిరుగుతుంది. 2000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఇది. పరంబునాడు ప్రాంతాన్ని వేల్పరి పాలించేవాడు. అది ఒక కొండ ప్రాంతాలుతో కూడిన రాజ్యం, 300 గ్రామాలు చుట్టూ ఉండేవి. చాలా అందమైన ప్రకృతికే ఈ ప్రాంతానికి ప్రాణం. సంగం యుగంలో ఈ కథ జరుగుతుంది. ఆ సమయంలో చేర, చోళ , పాండ్య రాజవంశాలు తమిళ ప్రాంతాన్ని పాలించాయి. వాళ్లు ముగ్గురూ కత్తి గట్టి ‘వెల్పరి’రాజ్యాన్ని ఆక్రమించుకోవటానికి దాడి చేస్తారు. ఆ యుద్దం చాలా కాలం పాటు సాగింది. అది ఎలా జరిగింది. ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేసారు. చిన్న రాజు అంత పెద్ద మూడు రాజ్యాల వారిని ఎదిరించి ఎలా నిలబడ్డాడు అనేది అసలు కథ.
ఈ నవల ఎత్తుగడలోనే భారీతనం ఉంది. అదే శంకర్ ని ఎట్రాక్ట్ చేసింది. కల్కి నవలను ... పొన్నియన్ సెల్వన్ సినిమాగా మణిరత్నం రూపొందించిన విధంగా భారీ బడ్జెట్ తో ఈ నవలను తెరకెక్కించాలనేది శంకర్ ఆలోచన. శంకర్ కు నిర్మాతలు కొదవ కాదు. అయితే ఇంత పెద్ద సినిమాను తెరకెక్కించాలంటే ఎంత కాలం పడుతుంది. ఎంతమంది నటులు అవసరం అవుతారు అనేది పెద్ద ప్రశ్న.
రూ.1000కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించాల్సిన ఈ సినిమాని కరణ్ జోహార్, నెట్ఫ్లిక్స్ ఇండియా, పెన్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే వారికి ప్రపోజల్ పెట్టారని, వారు ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి ఈ సినిమాలో హీరోగా ఎవరు చేయాలి, ఎవరితో ముందుకు వెళ్లాలనేది శంకర్ ఆలోచనగా చెప్తున్నారు.
ఈ సినిమాకోసం వేర్వేరు హీరోలను శంకర్ పరిశీలిస్తున్నారట. ‘కేజీయఫ్ 1, 2’ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన యశ్ అయితే బాగుంటాడని ఆయన అనుకున్నారట. ప్రశాంత్నీల్ తెరకెక్కించిన ఆ చిత్రాలతో యశ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయనతోను నామ మాత్రంగా చెప్పారని, ప్రపోజల్ పెట్టారని వినికిడి.
అయితే అంతకుముందు ఇదే సినిమాను శంకర్.. తమిళ స్టార్ హీరో సూర్యతో తీయబోతున్నారని వార్తలు వచ్చాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు గానీ.. ఒకవేళ తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ భారీ ప్రాజెక్ట్లో సూర్య నటిస్తారో లేదా యశ్ నటిస్తారా అనేది చూడాలి.
వీటితో పాటు రణ్వీర్ సింగ్ (Ranveer Singh)ని ప్రధాన పాత్రలో పెట్టి మిగతా హీరోలను సీన్ లోకి తెచ్చి శంకర్ ఓ టైమ్ లో అనుకున్నారు. కానీ అదీ కార్య రూపం దాల్చలేదు. ఇప్పుడు శంకర్ దృష్టి ప్రభాస్ పైన పడిందని చెప్తున్నారు. కానీ ప్రభాస్ కు ఉన్న కమిట్మెంట్స్ దృష్ట్యా ఇది సాధ్యమయ్యే కాంబినేషన్ కూడా కాదు అంటున్నారు. ఏదైమైనా శంకర్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. త్వరలో భారీ ఎనౌన్సమెంట్ రావచ్చు.
ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం శంకర్ దృష్టి మొత్తం రామ్చరణ్ హీరోగాగా ‘గేమ్ ఛేంజర్’ టైటిల్తో తెరకెక్కుతున్న చిత్రంపైనే ఉంది.
గేమ్ ఛేంజర్ గురించి శంకర్ మాట్లాడుతూ...‘‘నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కింది. అందుకే నేరుగా తెలుగులోనే ఓ సినిమా తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆమేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’తో నా కల నెరవేరుతోంది. కార్తీక్ సుబ్బరాజు కథతో దీన్ని రూపొందిస్తున్నా. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం. నా నుంచి ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేశారని సమాచారం. కియారా అడ్వాణి హీరోయిన్. అంజలి, శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్చంద్ర కీలక పాత్రలు పోషించారు