సౌత్‌ సినిమాలను చూసి షేక్‌అవుతున్న బాలీవుడ్‌.. తనకెదురైన సంఘటనతో వివరించిన కమేడియన్‌ అలీ..

First Published May 18, 2022, 9:11 PM IST

సౌత్‌ సినిమాలపై, బాలీవుడ్‌పై హాస్యనటుడు అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ సినిమాలను చూసి నార్త్ వాళ్లకి వణుకు పుడుతుందంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ అవుతుండటం విశేషం. 

ఒకప్పుడు సౌత్‌ సినిమాలపై హిందీ(నార్త్) వాళ్లకి ప్రేమ ఉండేదని, రాను రాను అది క్రమంగా పెరుగుతూ వచ్చిందని చెప్పారు హాస్య నటుడు అలీ. అయితే గత మూడునాలుగేళ్లుగా సౌత్‌ సినిమాలు, ముఖ్యంగా తెలుగు సినిమాలు నార్త్ లో దుమ్మురేపుతున్నాయి. బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్నాయి. దీంతో వాళ్లకి ఇప్పుడు సౌత్‌ సినిమాలంటే వణుకు పుడుతుందని తెలిపారు అలీ. ఆయన నటించిన `ఎఫ్‌3` సినిమా ఈ నెల 27న విడుదల కానున్న నేపథ్యంలో అలీ బుధవారం మీడియాతో ముచ్చటించారు. 

`బాహుబలి2`, `సాహో`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌2`, `పుష్ప` సినిమాలు బాలీవుడ్‌లో దుమ్మురేపాయి. `పుష్ప` సినిమా సుమారు వంద కోట్లు కలెక్షన్లని రాబడితే, `ఆర్‌ఆర్‌ఆర్‌` మూడువందల కోట్ల లోపు కలెక్ట్ చేసి బాలీవుడ్‌కి షాక్‌ ఇచ్చింది. హిందీ స్టార్స్ జలసీగా ఫీలయ్యేలా చేసింది. అప్పటికే సౌత్‌ సినిమాపై వారిలో జెలసీ స్టార్ట్ అయ్యిందే వార్తలు సోషల్‌ మీడియాలో ఊపందుకున్నాయి. అంతేకాదు కొందరు హీరోలు పరోక్షంగా కామెంట్లు కూడా చేశారు.
 

ఆ తర్వాత `కేజీఎఫ్‌ 2` వచ్చి బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇంకా చెప్పాలంటే ఉతికి ఆరేసింది. నార్త్ బాక్సాఫీస్‌ని పిండేసింది. ఈ సినిమా సుమారు నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని కేవలం హిందీ మార్కెట్‌లోనే రాబట్టడం విశేషం. దీంతో మరింతగా రగిలిపోతున్నారట బాలీవుడ్‌ సెలబ్రిటీలు. కొందరు సౌత్‌ సినిమాలను చూసైనా నేర్చుకోవాలని, బాలీవుడ్‌లో మార్పులు రావాలని బహిరంగంగానే మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు దిగ్గజ తారలు, మేకర్స్ కి పుండుమీద కారం చల్లినంత పనిచేస్తున్నాయి. 
 

ఇదే విషయాన్ని ఉద్దేశిస్తూ హాస్యనటుడు అలీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకప్పుడు మన టాలీవుడ్‌ వాళ్లం.. ఎక్కడెక్కడివాళ్లనో ఆర్టిస్టులను తెచ్చుకునే వాళ్లమని, కానీ ఇప్పుడు సీన్‌ మారిందని మన తెలుగు ఆర్టిస్టులను ఇతర దేశాల వారు, ఇతర భాషల వారు తీసుకుంటున్నారని, అది మన తెలుగు ఆర్టిస్టుల్లో ఉన్న సత్తాని తెలియజేస్తుందని చెప్పారు. తనకు ఓ నేపాలి భాషలో ఆఫర్‌ వచ్చిందని చెప్పారు అలీ. దీంతోపాటు తమిళంలో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నానని, అలాగే కన్నడలో ధృవ సర్జా హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ పాత్ర చేస్తున్నట్టు చెప్పారు అలీ. 

ఇప్పుడు మనం సౌత్‌ యాక్టర్‌ కాదని, ఇండియన్‌ యాక్టర్స్ అని చెప్పారు. అంతేకాదు దుబాయ్‌కి వెళ్లినప్పుడు ఓ వ్యక్తి తనని గుర్తుపట్టి, తాను నటించిన సినిమాల గురించి చెప్పారని, అలాగే బ్రహ్మానందం, ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, ప్రభాస్‌, ఇలా హీరోలందరు పేర్లు చెబుతూ, ఆయా సినిమాల గురించి మాట్లాడారని, మరో దేశంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని, మన తెలుగు వారిని ఇతర దేశాల వారు ఎంతగా అభిమానిస్తున్నారనేదానికిది నిదర్శనమన్నారు అలీ. 

ప్రస్తుతం `అంటేసుందరానికి`, `లైగర్‌`, `ఖుషీ`, `ఒకే ఒక జీవితం` చిత్రాల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కొత్తగా వస్తున్న దర్శకులు, చిన్న సినిమాల వాళ్లు కేవలం పాత్రలు చెబుతున్నారని, కథలు చెప్పడం లేదని, ఆ సినిమా చేశాక తీరా అది చాలా తేడా కొడుతున్నాయని, తర్వాత అలీకి ఇలాంటి సినిమాలు చేయాల్సిన ఖర్మేంటి? అనే విమర్శలు వస్తుంటాయని, అందుకే చేయడం లేదని, కథ ఏంటి? దర్శకుడెవరు ? తను చేయగలడా లేదా? అనేది చూసుకుని సినిమాలు చేస్తున్నానని, అందువల్లే సినిమాలు తగ్గిపోయాయని తెలిపారు అలీ. 

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా, తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహార్‌ హీరోయిన్లుగా, సునీల్‌, అలీ కీలక పాత్రలు పోషించిన `ఎఫ్‌3` చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతుంది. ఇందులో తాను పాల బేబీ పాత్రలో నటించినట్టు చెప్పారు అలీ. చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీని ఇందులో చూడొచ్చన్నారు. ఈవీవీ, దాసరి, దర్శకేంద్రుడు వంటి దర్శకుల తరహాలో అనిల్‌ ఈ సినిమాని డీల్‌ చేశాడని తెలిపారు. వెంకీ కామెడీ టైమింగ్‌ ఎక్స్ టార్డినరీ అని తెలిపారు. థియేటర్లో నవ్వులే నవ్వులు అని తెలిపారు అలీ. 

click me!