జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు టాలీవుడ్ లో అందరి ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ గా మారిపోయాడు. వేణు తెరకెక్కించిన బలగం చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలోని భావోద్వేగాలు గ్రామ గ్రామానికి చొచ్చుకుపోయాయి. హృదయానికి హత్తుకునే విధంగా వేణు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
సినీ రాజకీయ ప్రముఖుల నుంచి డైరెక్టర్ వేణుకి ప్రశంసలు దక్కాయి. భావోద్వేగాలని అద్భుతంగా ఆవిష్కరిస్తూ బలగం చిత్రాన్ని మరచిపోలేని మూవీగా మలిచారు అంటూ వేణు ప్రశంసలు అందుకున్నారు.ప్రస్తుతం బలగం వేణు.. నేచురల్ స్టార్ నానిని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
తాజాగా వేణు తన బెస్ట్ ఫ్రెండ్ మరో కమెడియన్ ధనరాజ్ తో కలసి అలీతో సరదాగా షోకి హాజరయ్యారు. ఈ ప్రోమో విడుదలయింది. ధనరాజ్ కూడా డైరెక్టర్ గా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షోలో ధనరాజ్ మాట్లాడుతూ తాను 2003లో నటుడిగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాను అని అన్నారు. 2023లో డైరెక్టర్ అయ్యావు.. నీకు 3 బాగా కల్సి వచ్చినట్లుంది అని అలీ అన్నారు.
కలసి వచ్చింది కానీ.. దానికి 20 ఏళ్ళు పట్టింది అని వేణు తెలిపాడు. ఆ తర్వాత వేణు, ధనరాజ్, అలీ మధ్య సరదా సంభాషణలు జరిగాయి. అలీ ఎవరిగురించో ప్రస్తావించారు. వెంటనే వేణు మాట్లాడుతూ ఆయన చేయి పడ్డవాళ్లంతా స్టార్లు అయ్యారు. నాకు తగల్లేదు అందుకే ఇంత లేట్ అయింది అని చెప్పుకొచ్చాడు.
కమర్షియల్ చిత్రాలు రాణిస్తున్న టైంలో బలగం లాంటి పల్లెటూరి భావోద్వేగాల నేపథ్యంలో సినిమా చేయడానికి కారణం ఏంటి అని అలీ ప్రశ్నించారు. అయితే వేణు ఎలాంటి సమాధానం ఇచ్చాడో ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే తనకి ఎదురైన అవమానం మాత్రం వేణు బయట పెట్టాడు.
సినిమా మేకింగ్ లో టెక్నీషియన్స్ తో చర్చలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో ఓ టెక్నీషియన్ అన్నాడు.. ఏదో పెద్ద బాహుబలి తీస్తున్నట్లు ఫీల్ అవుతున్నావ్ అంటూ అవమానించాడు. బలగం రిలీజ్ అయ్యాక మీరు చూసి ఇది చిన్న సినిమాల్లో బాహుబలి అని అభినందించడం మరచిపోలేని అనుభూతి అని వేణు తెలిపాడు.