
దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారసుడు'/ వారిసు చిత్రం సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్స్ తమిళంలో ఆల్రెడీ ప్రారంభం అయ్యాయి.
చెన్నైలోని మెట్రో ట్రైన్కు వారిసు పోస్టర్లను అతికించి సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశారు. తమిళనాడులో వారిసు చిత్రాన్ని పంపిణీ చేస్తున్న సిల్వర్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్ను నిర్వహిస్తోంది. అయితే తెలుగులో పరిస్దితి ఏమిటి...తెలుగులోనూ భారీగా రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు తెలుగు నిర్మాత దిల్ రాజు, తెలుగులో నెంబర్ వన్ గా వెలుగుతున్న రష్మిక హీరోయిన్, డైరక్టర్ వంశీ పైడిపల్లి తెలుగువాడే. ఇలా హీరో కాకుండా మేజర్ గా ఉండే మిగతా వాళ్లు తెలుగు వారే కావటంతో ఇక్కడా మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఈక్రమంలో దిల్ రాజు ఇక్కడ కూడా ప్రమోషన్స్ స్పీడు పెంచాలనుకుంటున్నట్లు సమాచారం.
అయితే విజయ్ మొదటి నుంచీ ప్రమోషన్స్ కు బాగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కేవలం చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు హాజరవుతారు. తెలుగులో అయితే ప్రమోషన్స్ కు ఇక్కడకు రావటం లేదు. ఇక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం లేదు. కానీ దిల్ రాజు ఎలాగైనా ఈ సారి విజయ్ ని హైదరాబాద్ ప్రమోషన్స్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఓ ప్రక్కన చిరంజీవి, బాలయ్య చేసిన వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నప్పుడు ప్రమోషన్స్ ఖచ్చితగా విజయ్ సినిమాకు అవసరం అవుతాయి. ఇప్పటిదాకా ఈ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ కాలేదు. దాంతో వారసుడుకు ఎగ్రిసివ్ గా ప్రమోషన్స్ కోరుకుంటున్నారు. ఈ విషయమై విజయ్ కు చెప్పి కన్వీన్స్ చేస్తున్నారట దిల్ రాజు. మరి విజయ్ ఒప్పుకుని తెలుగు మార్కెట్ పై దృష్టి పెడతారో లేదో చూడాలి.
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.