మహానటి సావిత్రి జీవిత చరిత్రతో దర్శకుడు నాగ్అశ్విన్ 'మహానటి' సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తరువాత సావిత్రి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఆమె చనిపోయిన తరువాత ఏం జరిగిందనే విషయాలను తెరపై చూపించలేదు. అయితే బయట మాత్రం ఆమె పార్థివ దేహాన్ని జెమినీ గణేశన్ ఇంట్లోకి రానివ్వలేదని.. ఆమె ఆస్తుల విషయాలో కూడా చాలా మోసం చేశాడని రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ విషయాలపై జెమినీ మొదటిభార్య కూతురు కమలా సెల్వరాజ్ స్పందిస్తూ.. ''సావిత్రి చనిపోయిన తరువాత ఆమె పార్థివ దేహాన్ని మా ఇంటికే తీసుకొచ్చాం. అప్పుడు మా ఇల్లు చాలా పెద్దగా ఉండేది. కాబట్టి ఇంటిముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. చివరిచూపు కోసం అభిమానులు కూడా వచ్చారు. ఆ సమయంలో నాన్న సావిత్రి చూడండి ఎలా అయిపోయిందో అంటూ మాకు చూపిస్తూ ఏడ్చారు. నాన్న ఆస్తుల విషయంలో మోసం చేశారనే ఆరోపణల్లో నిజం లేదు. కొందరు బంధువులు ఆస్తుల్ని సొంతం చేసుకోవాలని చూస్తే నాన్న వారితో కోర్టులో పోరాడి ఆ ఆస్తుల్ని సావిత్రి ఇద్దరి పిల్లలకు వచ్చేలా చేశారు. ఆమె ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా సహాయం చేయాలని ఆమె దగ్గరకు వెళ్లారు. కానీ నాన్నను దగ్గరకు రానిచ్చేవారు కాదని'' తెలిపారు.