‘పక్కా కమర్షియల్’ ఫలితం.. మారుతీపై ప్రభాస్ ఫ్యాన్స్ గుస్సా.. వద్దే వద్దంటున్నారే.!

By team teluguFirst Published Jul 3, 2022, 2:55 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), మారుతీ కాంబినేషన్ లో ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా అఫిషియల్ అనౌన్స్ రాబోతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీపై అభ్యంతరం తెలుపుతున్నారు. 
 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. వరుసగా ఒక్కో సినిమా షెడ్యూల్ ను పూర్తి చేస్తూ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన హిందూ  మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ (Adipurush) రిలీజ్ కు సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరోవైపు కేజీఎఫ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ (Salaar)లో నటిస్తున్నారు. అలాగే టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే (Project K) షూటింగ్ నూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ ల తర్వాత చాలా ఈజీగా సబ్జెక్ట్ చేయాలనే ఆలోచనతో ప్రభాస్, మారుతీతో ఓ సినిమాను చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో టాక్ నడుస్తోంది. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ కంటెంట్ తో రూపుదిద్దుకోనున్నట్టూ వార్తలు వచ్చాయి. తాజాగా అప్డేట్ ప్రకారం.. మరో పది రోజుల్లో మారుతీ - ప్రభాస్ కాంబినేషన్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీతో ప్రభాస్ సినిమా అంటే అప్పట్లో ఫ్యాన్స్, ఆడియెన్స్ కాస్తా థ్రిల్ ఫీలయ్యారు. కానీ ప్రస్తుతం మాత్రం మారుతీతో సినిమా వద్దంటే వద్దంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. 

మారుతీ (Maruthi) దర్శకత్వంలో హీరో గోపీచంద్ (Gopichand), హీరోయిన్ రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). ఈ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పక్కా కమర్షియల్ హిట్ కొడుతుందనే టాక్ తో వచ్చిన ఈ మూవీ కాస్తా మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. మరికొందరు డిజాస్టర్ అని అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

త్వరలో ప్రభాస్ - మారుతీ సినిమా ప్రకటన రాబోతుండటంతో కంగారు  పడుతున్నారు. వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ ను మారుతీ ఎలా డీల్ చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. వెంటనే మారుతీతో సినిమాను క్యాన్సిల్ చేయాలని ప్రభాస్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక దీనిపై మారుతీ, ప్రభాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఇప్పటికే ప్రభాస్ కు ‘బాహుబలి’ తర్వాత అంతటి హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం ‘సలార్’, ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్ట్ కే’పై ఆశలు పెట్టుకున్నారు. 

click me!