
సీనియర్ నటి జెమినీ సరస్వతి(94) కన్నుమూశారు. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. `చంద్రలేఖ` చిత్రం ద్వారా డాన్సర్గా పరిచయమయ్యారు.
ఆమె అసలు పేరు సరస్వతి. కానీ జెమినీ స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించడంతో, జెమినీ స్టూడియో నిర్మించిన `చంద్రలేఖ` చిత్రంలో నటించడంతో ఆమెకి జెమినీ సరస్వతి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత `కాదల్ పడుత్తుమ్ పాడు` చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు.
వయసు మీద పడటంతో ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురయి కన్నుమూశారు. జెమినీ సరస్వతి మృతి పట్ల తమిళ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేస్తుంది. సరస్వతికి దక్షిణామూర్తి, సెల్వరాజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు.