'వైయస్ జగన్' పై వర్మ చిత్రం,టైటిల్ ఏంటంటే

By Surya PrakashFirst Published Apr 13, 2021, 4:24 PM IST
Highlights

ఇప్పుడు మరో వివాదాస్పద చిత్రం తెరకెక్కించబోతున్నారట. ఆ సినిమా వైయస్ జగన్ చుట్టూ తిరిగే కథతో సాగుతుందిట. ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు ఆ సినిమాలో ఉంటాయట. 

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ చేయాలనుకుంటారు. వార్తల్లో నిలవాలనుకుంటారు. అందుకు కథాంశాలనే తన సినిమాలకు ఎంచుకుంటారు. ముఖ్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన వరసపెట్టి సినిమాలు చేస్తూ వస్తున్నారు.  ఎన్టీఆర్‌ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కించి, అందులో చంద్రబాబుని టార్గెట్ చేసారు.  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ చిత్రం విడుదలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిచింది. అది వైయస్ జగన్ కు రాజకీయంగా ఉపయోగపడిందని అన్నారు.  ఆ తర్వాత కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చినా అదీ చంద్రబాబు, లోకేష్ లకు వ్యతిరేకంగా తీసిందే. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఓ చిత్రం చేసారు. 

ఇలా వరస పెట్టి ఆంధ్రా రాజకీయాలపై సినిమాలు తీసిన ఆయన వార్తల్లో నిలిచారు. అయితే ఈ మధ్యన ఆయన అలాంటి సెన్సేషన్ సబ్జెక్టు ఏదీ తెరకెక్కించలేదు. దాంతో సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వివాదాస్పద చిత్రం తెరకెక్కించబోతున్నారట. ఆ సినిమా వైయస్ జగన్ చుట్టూ తిరిగే కథతో సాగుతుందిట. ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు ఆ సినిమాలో ఉంటాయట. ఈ సినిమాకు ఇప్పటికే `జగమొండి` అనే టైటిల్ ను పెట్టారని వినపడుతోంది. ఈ సినిమాకి నిర్మాతగా .. కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు వ్యవహరిస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం `డి`-కంపెనీ అనే సినిమా తీసి రిలీజ్ కు రెడీ గా ఉన్నారు. ఆ నిర్మాతే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అంటున్నారు. ఈ సినిమా దాదాపు జగన్ బయోపిక్ లా సాగుతుందిట. జగన్ ..రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయవంతంగా జనాల్లోకి వెళ్లటం దాకా అన్నీ టచ్ చేస్తారట. ఆయనలోని మొండి తత్వమే జగన్ ని ఈ స్దాయికి తెచ్చిందనే అర్దం వచ్చేలా జగమొండి అని టైటిల్ పెడుతున్నారు.
 

click me!