
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన `మాస్ జాతర` మూవీ మరో రెండు రోజుల్లోనే విడుదల కావాల్సింది. కానీ తాజాగా ఇది వాయిదా పడింది. చిత్ర బృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. `మాస్ జాతర`ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా ఈ మూవీ రూపొందుతుంది. `ధమాఖా తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ కట్టిన చిత్రమిది. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.
`మాస్ జాతర` సినిమాని ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నట్టు గతంలో టీమ్ ప్రకటించింది. ఈ మేరకు టీజర్ని కూడా విడుదల చేశారు. టీజర్ బాగా ఆకట్టుకుంది. సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. రవితేజ మార్క్ మాస్ కమర్షియల్ సినిమా వస్తుందనే చర్చ స్టార్ట్ అయ్యింది. కానీ విడుదల వాయిదా వేస్తున్నట్టు మంగళవారం చిత్ర బృందం ప్రకటించడం గమనార్హం.
దీనికి కారణాలు చెబుతూ, ఇటీవల తెలుగు పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా.. సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో సిద్ధం చేయలేకపోయామని నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని విడుదల చేయడం కంటే కాస్త సమయం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు.
`మాస్ జాతర` చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో సర్ప్రైజింగ్ కంటెంట్ రాబోతుందని నిర్మాతలు హామీ ఇచ్చారు. కాస్త ఆలస్యమైనా అసలు సిసలైన మాస్ పండుగను థియేటర్లలో తీసుకొస్తామని నిర్మాతలు తెలిపారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు అక్టోబర్ మూడో వారంలో సినిమాని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.