
సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) `పెద్దన్న` పరాజయంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అనిపించింది. కేవలం ఆయన నెల్సన్ దిలీప్ కుమార్తో `జైలర్`(Jailer) చిత్రంలోనే నటిస్తున్నారు. నెక్ట్స్ చేయబోయే సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో రజనీ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారనే వాదన విపినించింది. అయితే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో రజనీ కొంత గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు జోరు పెంచారు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ల విషయంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఆయన ఒకేసారి రెండు సినిమాలకు సైన్ చేయడం విశేషం. అంతేకాదు ఒకే బ్యానర్లో రెండు సినిమాలు చేయడం మరో విశేషమైతే, ఆ రెండూ ఒకేసారి ప్రారంభం కాబోతుండటం ఇంకో విశేషం.
ప్రస్తుతం `బీస్ట్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్` చిత్రంలో నటిస్తున్నారు రజనీకాంత్. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తుందని సమాచారం. ఇదిప్పుడు చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా తనతో `2.0` చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్(Lyca Production) బ్యానర్లో రెండు సినిమాలకు సైన్ చేశారు రజనీకాంత్. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్ హెడ్ తమిల్ కుమారన్ వెల్లడించారు. ఈ రెండు చిత్రాలకు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు నవంబర్ 5న చెన్నైలో జరగనున్నాయని వెల్లడించారు.
ఈ చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఛైర్మెన్ సుభాస్కరన్, డిప్యూటీ చైర్మెన్ ప్రేమ్ శివస్వామి సమర్పణలో నిర్మితం కానున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు దర్శకులెవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను కూడా వెల్లడించలేదు. ఆ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది నిర్మాణ సంస్థ. అయితే రజనీ సైలెంట్గా ఓకే సారి రెండు చిత్రాలకు సైన్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.