అన్నయ్యను మోసం చేసిన వారికి చెప్పుతోకొట్టినట్లు సమాధానమివ్వాలి

First Published Dec 6, 2017, 5:41 PM IST
Highlights
  • ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్
  • ఈ సందర్భంగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రస్థావన
  • మెగాస్టార్ ని మోసం చేసినవారికి చెప్పుతో కొట్టినట్లు సమాధానమివ్వాలన్న పవన్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చేసిన ప్రసంగం మెగా పవర్ అభిమానులనే కాక.. తెలుగు ప్రజలందరినీ ఆలోచింప చేసింది. అన్ని పార్టీలను, పార్టీల అధినేతలను చెండాడిన పవన కళ్యాణ్ తన అన్న మెగాస్టార్ చిరంజీవిని మోసం చేసారని ఆరోపించారు.

 

చిరంజీవిని మోసం చేసిన వారిని జీవితంలో మరవనన్నారు. సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన ఒక మెగాస్టార్ ను కూడా... చిల్లర రాజకీయాలకు బలి చేశారని పవన్ ఆరోపించారు. చిరంజీవి గారికి చేసిన ద్రోహం కంటే.. ఒక కొత్త మార్పుకు చేసిన ద్రోహం ఎప్పటికీ క్షమించనని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచి మార్పు జరగాల్సి వుండగా ప్రజారాజ్యం పార్టీని నామరూపాలు లేకుండా చేశారని, అది తలుచుకుంటే నేను కొన్ని సందర్భాల్లో నిస్సహాయతతో ఒక్కడ్నే కూర్చుని ఏడుస్తానని పవన్ తెలిపారు.

 

తనకు ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధలేదని, కానీ అన్నయ్య చిరింజీవిని మోసం చేసిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిని మోసగించిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా యువత అంతా పని చేయాలని పవన్ పిలుపునిచ్చారు. కొన్నిదశాబ్దాలుగా సినీరంగాన్ని ఏలుతున్న చిరంజీవిని స్వార్థం కోసం, చిన్న లబ్ది కోసం దెబ్బతీశారని, దెబ్బ తీసిన ఏ ఒక్కరినీ మరిచిపోలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

 

మంచి చేయాలనుకున్న మెగాస్టార్ ను కూడా చిన్న కీటకాలు ఎలా తినేశాయో అలా తినేశారు. చిరంజీవి గారికి ద్రోహం చేసిన వాళ్లని కొడితేనో, తిడితేనో సరిపోదు. వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు చేసి చూపించాలనేదే జనసేన పార్టీ సిద్దాంతం అన్నారు. ఆ దిశగా యువత ప్రతి ఒక్కరూ పనిచేయాలని పవన్ పిలుపునిచ్చారు.

click me!