
టాలీవుడ్లో గతేడాది నుంచి వరుస మరణాలు చోటు చేసుకుంటున్నారు. నిన్ననే(ఆదివారం) మ్యూజిక్ డైరెక్టర్ `రాజ్-కోటి`లో రాజ్ కన్నుమూశారు. ఆ విషాదం నుంచి బయటపడకముందే మరో విషాదం చేసుకుంది. సీనియర్ నటుడు శరత్బాబు కన్నుమూశారు. దాదాపు నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు(సోమవారం) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. ఆయన నటించిన చివరి చిత్రం `మళ్ళీ పెళ్ళి`. నరేష్,పవిత్ర లోకేష్ కలిసి నటించిన ఈ సినిమాలో శరత్బాబు.. సూపర్ స్టార్ కృష్ణ పాత్రని పోషించారు.
`మళ్ళీ పెళ్ళి` ఈ నెల 26న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో శరత్బాబు మరణం టీమ్ని తీవ్రంగా కలచివేసింది. ఈ వార్తతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ ఓ ఎమోషనల్ నోట్ ద్వారా నివాళ్లు అర్పించారు. ఇందులో చెబుతూ, `సుమారు ఐదు దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సీనియర్ నటులు శరత్బాబు శివైక్యం చెందడం మాకు మాత్రమే కాదు, కళారంగానికి కూడా తీరని లోటు`.
చివరి సారిగా ఆయన నటుడిగా `మళ్ళీ పెళ్ళి` సినిమాలో ఒక అద్భుతమైన పాత్రని పోషించారు. శరత్బాబు ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, ఈ పరిస్థితుల్లో వారి కుటుంబసభ్యులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం, భావోద్వేగభరితమైన హృదయాలతో వారికి మా ఘన నివాళి` అని పేర్కొన్నారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన `మళ్ళీ పెళ్ళి` చిత్రంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించారు. ఇది నరేష్ రియల్ లైఫ్ ఆధారంగా ముఖ్యంగా మూడు పెళ్లిళ్ల ఘటనతో రూపొందుతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.
డా.నరేష్ వి.కె మాట్లాడుతూ.. శరత్ బాబు గొప్ప విలక్షణ నటుడే కాదు నాకు చాలా ఏళ్ళుగా మంచి మిత్రుడు. పెద్దన్నయ్య లాంటి వాడు. `కోకిల` లాంటి ఎన్నో మంచి సినిమాలు చేశాం. `సాగర సంగమం`లో ఆయన చేసిన పాత్ర కొన్ని తరాలు మర్చిపోదు. మా కాంబినేషన్ లో ఆయన చేసిన ఆఖరి సినిమా `మళ్ళీ పెళ్లి`. సినిమా విడుదల కాకముందే ఆయన వెళ్ళిపోయారు. ఆయన మరణం నిజంగా గుండెల్ని పిండేస్తుంది. ఆనందంగా వుండండి అని చెప్పి వెళ్లారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి' అని ప్రార్థించారు నరేష్.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శరత్బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్ నగర్లోని ఫిల్మ్ ఛాంబర్(5.30 గంటల)కి తీసుకొచ్చారు. దాదాపు రెండు గంటలపాటు అనగా 7.30 వరకు అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారట. అనంతరం చెన్నైకి ఆయన భౌతికకాయాన్ని తీసుకెళ్లనున్నట్టు పీఆర్ టీమ్ వెల్లడించింది. శరత్బాబు చాలా కాలంగా చెన్నైలో నివసిస్తున్నారు.