
సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్తానంలో తారకరత్న అంతిమ సంస్కారాలను ఆయన తండ్రి మోహనకృష్ణ పూర్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనకు ఆశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్ఛాంబర్ నుంచి మహాప్రస్తానం వరకు తారకరత్న అంతిమయాత్ర సాగింది. తారకరత్న భౌతికకాయం వెంటే వైకుంఠ రథంలో బాలకృష్ణ, చంద్రబాబునాయుడు మహాప్రస్థానానికి చేరుకున్నారు. తారకరత్న అంతిమయాత్రలో నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తారకరత్న భౌతికకాయం మహాప్రస్తానం చేరుకున్న తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బాలకృష్ణతో పాటు ఇతర కుటుంబ సభ్యులు తారకరత్న పాడె మోశారు. అనంతరం మోహనకృష్ణ.. తన కుమారుడు తారకరత్న అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Also Read: NBK108లో తారకరత్న చేయాల్సింది.. అంతలోనే ఇలా.. అనిల్ రావిపూడి ఎమోషనల్ కామెంట్స్!
ఇక, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అయితే గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే వచ్చారు. అయితే వైద్యులు తారకరత్నను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించారు. హాస్పిటల్లో చేరినప్పటి నుంచి ఆయన పరిస్థితి క్రిటికల్ గానే వుండటంతో ఐసియూలోనే ఉంచి చికిత్స అందించారు. విదేశాల నుంచి ప్రత్యేక వైద్యబృందాలను తీసుకువచ్చి మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న.. నందమూరి కుటుంబసభ్యులను, సినీప్రియులను దు:ఖంలో ముంచి శనివారం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
Also Read: పిల్లలకు అలా పేర్లు పెట్టి... తాతపై అభిమానాన్ని చాటుకున్న తారకరత్న.!
ఇక, ఆదివారం తెల్లవారుజామున తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీ నటులు బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్, రాఘవేంద్రరావు, మురళీమోహన్, బోయపాటి శ్రీను, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని, పలువురు టీడీపీ నేతలు.. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న సమయంలో బాలకృష్ణ కన్నీటిని ఆపుకోలేకపోయారు.
తారకరత్న మరణంతో భార్య అలేఖ్య రెడ్డి, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు వారిని పరామర్శించి ఓదారుస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం అలేఖ్య కొంత అస్వస్థతకు గురయ్యారు. అలేఖ్య అస్వస్థత గురించి స్పందించిన విజయసాయిరెడ్డి.. కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. కాళ్లు, చేతులు కొంచెం వణకడం మొదలైందని.. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని.. కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని చెప్పారు.
Also Read: Tarakaratna: తారకరత్న నటించిన చివరి చిత్రం ఇదే... రిలీజ్ ఎప్పుడంటే!
ఫిల్మ్ఛాంబర్లో..
సోమవారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన నివాసం ఫిల్మ్ఛాంబర్కు తరలించారు. అక్కడే కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తారకరత్నకు కడసారి నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిల్మ్చాంబర్ వద్ద తారకరత్న భౌతికకాయాన్ని చూసి ఆయన తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు అలా చూసి తట్టుకోలేకపోయారు. మరోవైపు తారకరత్న సతీమణి అలేఖ్య పూర్తిగా విషాదంలో మునిగిపోయారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లతో పాటు పురంధేశ్వరి, నందమూరి సుహాసిని, వెంకటేశ్, సురేష్ బాబు, ఆదిశేషగిరి రావు, బుర్రాసాయి మాధవ్, అనిల్ రావిపూడి, చింతమనేని ప్రభాకర్ రావు.. తదితరులు ఫిల్మ్ఛాంబర్కు చేరుకుని తారకరత్నకు కడసారి నివాళులర్పించారు. మరోవైపు నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున ఫిల్మ్చాంబర్కు తరలివచ్చారు. తారకరత్న భౌతికకాయం వద్ద కేఏ పాల్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.