
బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు. ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర క్రేజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరో ప్రక్క స్టార్ హీరోల చిత్రాలు రీరిలీజ్ లు హంగామా చేస్తున్నాయి. అసలు రిలీజ్ ల కన్నా ఈ కొసరు రిలీజ్ లకే జనం ఎగబడుతున్నారు. ఈ నేపధ్యంలో బిగ్ స్క్రీన్లపై బాలయ్య మాస్ గర్జనకు డేట్ లాక్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ చిత్రం ఘరానా మొగుడు నటుడి పుట్టినరోజున విడుదలైంది, ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రీ రిలీజ్ ట్రెండ్ లో మహేష్ ‘పోకిరి’ , పవన్ ‘జల్సా’ మంచి వసూళ్లు రాబట్టాయి. అనుకోని విధంగా దనుష్ డబ్బింగ్ సినిమా ‘3’ కూడా మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది.
ఆ వరసలో గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవ రెడ్డి చిత్రాలు మళ్లీ థియేటర్లలో విడుదలయ్యాయి. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో బాలయ్య మొదటి హిట్ అయిన సింహా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ యాక్షన్ డ్రామా విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. బాలయ్య మార్చి 11, 2023న సింహాగా మరోసారి బిగ్ స్క్రీన్పై సందడి చేయబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది.
వరస పరాజయాలతో బాలకృష్ణ పని అయిపోయిందిక అనుకున్న వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వచ్చిందో సినిమా.. బాలకృష్ణ మాస్ ఇమేజ్ ఏంటో.. ఆయనకు సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చిందో సినిమా.. అదే సింహా. సాధారణంగా ఏ సినిమా అయినా కథ నుంచి పుడుతుంది.. కానీ సింహా మాత్రం నా మీసం నుంచి పుట్టిందంటూ బాలయ్య చాలా సార్లు చెప్పాడు. అలా ఈ సినిమా కాంబినేషన్ సెట్ అయింది.
ప్రొఫెసర్ శ్రీమన్నారాయణ.. డాక్టర్ నరసింహాగా తన నట విశ్వరూపంతో ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ కూడా సొంతం చేసుకున్నాడు బాలయ్య. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్తో సింహా దుమ్ము రేపింది. ఉత్తమ సంగీత దర్శకుడిగా చక్రిని నంది వరించింది. సింహా సినిమాను కొన్న ప్రతీ ఒక్కరు కూడా లాభాల్లో మునిగిపోయారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ 338 పైగా కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైంది సింహా. ఇక 92 సెంటర్లలో 100 రోజులు.. 3 కేంద్రాలలో 175 రోజులు పూర్తి చేసుకుంది. 2010లోనే ఈ చిత్రం 38 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది.
డాక్టర్ పాత్రలో బాలయ్య యాక్షన్ , డైలాగ్స్ కోసం ఈ సినిమాను ఆడియన్స్ కచ్చితంగా మళ్ళీ చూసే అవకాశం ఉంది. మరి ‘సింహా’ రీ రిలీజ్ తో బాలయ్య భారీ వసూళ్లు రాబడితే మిగతా మాస్ సినిమాలు కూడా క్యూ కడతాయనడంలో సందేహం లేదంటున్నారు అభిమానులు. సింహాలో స్నేహ ఉల్లాల్ మరియు నయనతార హీరోయిన్స్ గా నటించారు. 2010లో టాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో సింహా ఒకటి. నమిత, రెహమాన్, కె.ఆర్. విజయ, చలపతిరావు కీలక పాత్రలు పోషించారు. పరుచ్చేరి కిరీటి నిర్మించిన ఈ చిత్రానికి దివంగత చక్రి స్వరాలు సమకూర్చారు.