కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారు.. థియేటర్ల బంద్, టికెట్ ధరలపై మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్

Published : May 26, 2025, 05:10 PM IST
Kandula Durgesh

సారాంశం

సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అవుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు బంద్ ప్రకటించడం అనేక అనుమానాలకు కారణం అయింది. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందంటూ ఫ్యాన్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ వివాదం బాగా ముదరడంతో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో వెంటనే స్పందించిన ఫిలిం ఛాంబర్ థియేటర్ల బంద్ ఉండదని ప్రకటించింది. తాజాగా మంత్రి కందుల దుర్గేష్ థియేటర్ల అంశంపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు న్యాయం చేసేందుకు సిద్ధం 

సినీ పరిశ్రమ మనుగడకు ప్రభుత్వ సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ రంగంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి దుర్గేష్ పలు వివరాలు వెల్లడించారు. సినిమా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని స్పష్టంగా వివరించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ కలిసి కట్టుగా వస్తే ఎవరికీ ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా న్యాయం చేసేందుకు, అనుకూలంగా  నిర్ణయాలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. 

థియేటర్ల బంద్ పై విచారణ 

సినీ ప్రముఖులు కలవాలన్నది తమ ఉద్దేశం కాదని, కలిసినా కలవకపోయినా సినీ రంగంపై తాము కక్ష సాధించబోమన్నారు. సినిమాకు సంబంధించిన అనుమతులు, టికెట్ రేట్ల నిర్ణయాల్లో తక్షణ స్పందనతో పరిశ్రమకు మద్దతు అందిస్తున్నామని తెలిపారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నూతన ఫిల్మ్ పాలసీ రూపొందించడంపై కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలన్న నిర్ణయంపై హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ జరుగుతోందని, హోం శాఖ విచారణ అనంతరం నివేదిక అందించిన తర్వాత వాస్తవాలు వెల్లడిస్తామన్నారు. 

హరిహర వీరమల్లు రిలీజ్ టైంలో ఇలా.. 

జూన్ 12న విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం విషయంలో ఈ తరహా సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయో వాస్తవాలు వెలికితీస్తామన్నారు. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. పరిశ్రమలో పనిచేసే వర్గాల హితం, కళాకారుల హక్కులు, ప్రజల అభిరుచి కూటమి ప్రభుత్వానికి ముఖ్యమైనవిగా తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమను అస్థిరపరిచే చర్యలు ఎవరి నుంచి వచ్చినా సహించమని, చిత్ర పరిశ్రమను బలోపేతం చేయడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని, ఎవరి ప్రభావంతోనైనా పరిశ్రమలో కల్లోలం సృష్టించాలన్న యత్నాలను ఉపేక్షించమని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో సినిమావాళ్లను వేధించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సినీరంగాన్ని ప్రోత్సాహిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

టికెట్ ధరల పెంపుపై కొత్త విధానం 

సినిమా టికెట్ల రేట్లు పెంచమని సినీ రంగం నుండి నిర్మాతలు విడివిడిగా వచ్చి తమను కలుస్తారని, తాము కూడా అందుకు సరే అని చెబుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ క్రమంలో ఎవరో ఒకరు కోర్టుల్లో పిల్ వేస్తున్నారని తద్వారా అధికారులు కోర్టులు చుట్టూ తిరిగే దుస్థితి నెలకొందన్నారు. టికెట్ల ధరల పెంపుపై దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోందన్నారు. ఈ విధానాలన్నింటికి చెక్ పెట్టి నూతన ఫిల్మ్ పాలసీ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాలను తీసుకురావాలని భావించామన్నారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసమే తాము రేట్ల పెంపుకు అనుమతిస్తున్నామన్నారు. కొంతమంది సినిమా వాళ్ళు మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. బయటవాళ్ళు రావద్దు అంటూ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ చేత ఎవరు అలా మాట్లాడిస్తున్నారో తెలియదు అని కందుల దుర్గేష్ మండిపడ్డారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?