సైరా రిలీజ్: చెన్నైలో రికార్డ్.. మహేష్, ప్రభాస్ లని అధిగమించి!

By tirumala ANFirst Published Oct 1, 2019, 8:39 PM IST
Highlights

సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. ఓవర్సీస్ లో కూడా సైరా సందడి కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.   

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటిష్ వారితో పోరాడిన తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ వీరుడు చిత్రాన్ని సినిమాగా తెరక్కించాలని చిరంజీవి కొన్ని దశాబ్దాలుగా కలలు కన్నారు. ఎట్టకేలకు తన సొంత నిర్మాణ సంస్థలోనే ఆ కల సాకారం అయింది. 

ఉయ్యాలవాడ జీవిత చరిత్రని కథగా మలిచింది పరుచూరి బ్రదర్స్. వారు కూడా సైరా చిత్రం కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలోని ప్రధాన నగరాల్లో సైరా స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. కేవలం చెన్నై నగరంలోనే అక్టోబర్ 1 రాత్రి నుంచి 2వతేదీ ఉదయం వరకు 50 స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారంటే సైరా మానియా ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు. మహేష్ బాబు మహర్షి చిత్రానికి 20 స్పెషల్ షోలు, ప్రభాస్ సాహో చిత్రానికి 30 స్పెషల్ షోలని చెన్నైలో ప్రదర్శించారు. 

తాజాగా సైరా చిత్రం 50 స్పెషల్ షోలతో తిరుగులేని రికార్డ్ నెలకొల్పుతోంది. రాంచరణ్ నిర్మించిన ఈ చిత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. అమితాబ్, నయనతార, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా ఈ చిత్రంలో నటించారు. 

చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించగా, అనుష్క ఝాన్సీ లక్ష్మి బాయిగా గెస్ట్ రోల్ పోషించింది. 

click me!