త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఉండిపోతాయి

By Surya PrakashFirst Published Jun 17, 2020, 1:34 PM IST
Highlights

భారత్‌-చైనా మధ్య చోటు చేసుకుంటోన్న ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయంపై తెలుగు సినీ  ప్రముఖులు స్పందించారు. వీరమరణం పొందిన జవాన్లకు సెల్యూట్ చేశారు. మహేష్ బాబు, సాయి తేజ్, సుధీర్ బాబు, కాజల్ అగర్వాల్, అనసూయ వంటి వారి ట్వీట్స్ చూద్దాం.

భారత సైన్యంపై దాడి చేయాలన్న ఆలోచనలో ఉన్న చైనా సైనికులు, భారీ ఎత్తున రాళ్లు, ఇనుప రాడ్లు, ముళ్ల తీగలు చుట్టిన వెదురు బొంగులను సిద్ధం చేసుకుని, వాటితో దాడికి దిగారు. చైనా జవాన్లు విచక్షణారహితంగా దాడికి దిగారు. భారత సైనికులపై రాళ్లు రువ్వారు. వెదురు బొంగులకు చుట్టిన ఇనుప తీగలు భారీ నష్టాన్ని కలిగించాయి. వాటితో దాడి చేయడం వల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది. ఈ నేపధ్యంలో మన సెలబ్రెటీలు స్పందించారు.

'గాల్వన్‌ లోయ వద్ద మన జవాన్లు అమరులయ్యారని తెలుసుకుని కలత చెందాను. వారి త్యాగాల గుర్తులు మన హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. మన యోధులకు, వారిలోని దేశ భక్తికి సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను' అని మహేష్ బాబు పేర్కొన్నారు.

'లడఖ్‌లో మన వీర జవాన్ల బలిదానం పట్ల మాటలు రావట్లేదు. దేశాన్ని కాపాడడం కోసం విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల కుటుంబాలకు నా సానుభూతి' అని సాయితేజ్ ట్వీట్ చేశాడు.  

'బరువెక్కిన గుండెతో ఈ వార్త చదివాను. అమరవీరులకు సెల్యూట్' అని సుధీర్ బాబు పేర్కొన్నాడు.

'అమరులైన భారత జవాన్లకు సెల్యూట్‌ చేస్తున్నాను. ఓం శాంతి.. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను' అని హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేర్కొంది.  

'మేము దేశంలో ప్రశాంతంగా ఉండగలగడానికి మీ శౌర్య, పరాక్రమాలే కారణం. థ్యాంక్యూ, సెల్యూట్‌. ఇండియన్ ఆర్మీ జిందాబాద్' అని అనసూయ ట్వీట్ చేసింది.

click me!