కైకాల సత్యనారాయణ గారి పేరు చిరస్థాయిగా నిలిపేందుకు నా వంతు కృషి చేస్తాను– ఎంపీ బాలశౌరి

By Sambi ReddyFirst Published Dec 24, 2022, 8:16 PM IST
Highlights


మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కైకాల గారి కీర్తి విస్తరించేందుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 
 

ప్రముఖ నటుడు మచిలీపట్నం మాజీ యంపి నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నా అన్నారు ప్రసుత్త మచిలీపట్నం యం.పి వల్లభనేని బాలశౌరి. సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని సందర్శించటానికి మహాప్రస్థానానికి చేరుకుని నివాళులు అర్పించారు యంపి బాలశౌరి, టీటీడి బోర్డు సభ్యులు దాసరి కిరణ్‌కుమార్‌.

నివాళి అనంతరం బాలశౌరి  మాట్లాడుతూ–‘‘ సినిమా పరిశ్రమలో పౌరాణిక, జానపద, చారిత్రక,  సాంఘిక చిత్రాలు అనే తారతమ్యాలు లేకుండా దాదాపు ఆరు దశాబ్దాలుగా నటుడిగా తన సేవలను అందించారు కైకాలగారు. గతంలో యస్వీ రంగారావు గారు ఉండేవారు. తర్వాత కైకాల సత్యనారాయణ గారు తన నటనతో ఆయన లేని లోటును భర్తీ చేశారు . దాదాపు 750 పైచిలుకు చిత్రాల్లో నటించిన నటులు చాలా తక్కువ మంది ఉన్నారు చిత్ర పరిశ్రమలో.  పరిశ్రమలో కానీ, రాజకీయంగా కాని ఆయనకు మంచి వ్యక్తిగా ఎంతో పేరుంది. వ్యక్తిగతంగా నాకు పరిచయం ఆయన. నిన్న ఆయన మృతి పట్ల చిరంజీవి గారు కూడా స్పందించి ఎంతో చక్కగా మట్లాడారు. వారికున్న అనుబంధం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన స్వగ్రామం కౌతవరంలో ఆయన పేరు మీద ఒక కమ్యూనిటీ హాలు నిర్మించటానికి సాయం చేస్తాను. గుడివాడలో కైకాల సత్యనారాయణ కళాక్షేత్రం అని ఉంది. ఆ కళాక్షేత్రాన్ని మరింతగా డెవలప్‌ చేసి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపేవిధంగా ఒక పార్లమెంట్‌ సభ్యునిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’’ అన్నారు. 

సత్యనారాయణ గారి భౌతికకాయాన్ని చితివరకు మోసుకుంటూ వెళ్లి తుది నివాళులు అర్పించారు  నిర్మాత అల్లు అరవింద్, యంపీ బాలశౌరి, టీటీడి బోర్డు మెంబర్, సినీ నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, జీవిత,  నిర్మాతలు ఏడిద రాజా, పి.సత్యారెడ్డి, దర్శకులు నక్కిన త్రినాధరావు, రాజా వన్నెం రెడ్డి,  మాదాల రవి, ప్రజాగాయకుడు గద్దర్‌ , ఎర్రబెల్లి దయాకర్‌ రావు, నటి ఈశ్వరీరావు, శివకృష్ణ తుది నివాళులర్పించిన వారిలో ఉన్నారు. చివరిగా (చితికి) పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అశ్రు నయనాలతో నిప్పంటించగా ప్రభుత్వ లాంఛనాలతో మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి కైకాల సత్యనారాయణ గారి అంతిమ సంస్కారాలని గౌరవంగా ముగించి  ఆయన్ను సాగనంపారు.
 

click me!