లక్ష్మి మంచు..తెలంగాణా రాజకీయనాయకురాలు

By Surya PrakashFirst Published Feb 2, 2021, 9:01 AM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్ష్మీ మంచుకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో ఆమె చురుకుగా ఉంటూంటారు. మరో ప్రక్క ఎప్పటికప్పుడు టీవీ షోలు, విభిన్న పాత్రలతో పలకరిస్తూంటారు. ఇదే క్రమంలో లక్ష్మీ మంచు త్వరలో తెలంగాణాకు చెందిన రాజకీయనాయకురాలుగా కనిపించనుంది. అంతమాత్రానికి ఆమె రాజకీయాల్లోకి ప్రవేశిస్తోంది అనుకోవద్దు. మరి ఏమిటి అవతారం అంటే...

హిందీలో ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ను తెలుగులో ‘పిట్టకథలు’ పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మంచులక్ష్మి ఓ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగువారికి చేరువకానుంది.ఆమె నటించే పాత్ర ఏమిటంటే తెలంగాణాకు చెందిన ఓ రాజకీయనాయకురాలు. తెలంగాణాలోని మారు మూల పల్లెకు చెందిన మహిళగా కనిపించనుంది. పిబ్రవరి 19 నుంచి ప్రీమియర్ అయ్యే ఈ షో కోసం లక్ష్మీ మంచు బాగా కష్టపడుతోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ ...ఆమె పాత్ర చెప్పే డైలాగుల కోసం తెలంగాణా యాసను బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాడ్యులేషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని డబ్బింగ్ చెప్పించబోతున్నారు.

మంచు లక్ష్మీ తెలుగు ఎలా మాట్లాడుతుందో మనందరికీ తెలిసిందే. ఆమె భాష, యాస, మాట్లాడే విధానం తెలుగు ప్రజలు ఎక్కడున్నా ఇట్టే గుర్తుపట్టేటంత పాపులర్ అయ్యింది. ఆమె ఇంగ్లీష్ భాష, యాసపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఒక్కో సందర్భంతో తెలుగు, ఇంగ్లీష్ పదాలను కలిపి కూడా వాడేస్తుంది. దాంతో తెలంగాణాలో మాట్లాడేటప్పుడు అటువంటి సమస్యలు ఎదురుకాకూడదని దర్శకుడు భావిస్తున్నట్లు  తెలుస్తోంది.

ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి వస్తున్న మొదటి ఒరిజినల్ తెలుగు చిత్రం 'పిట్ట కథలు'. ఈ పిట్టకథలు మూవీని ఏకంగా నలుగు డైరెక్టర్లు రూపొందించడం విశేషం. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి ఈ చిత్రంలోని నాలుగు పార్టులుగా దర్శకత్వం వహించారు. ఈ ఆంథాలజీ మూవీని ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉండనుంది. అలాగే, ఈ 'పిట్ట కథలు'లోని నాలుగు కథలు నలుగురు మహిళల గురించి చూపించారు. ఆర్ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యూనీకార్న్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రోనీ స్క్రూవాలా, ఆశి దువాసారా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

click me!