వంశీ పైడిపల్లికు హీరో దొరికాడు...త్వరలో లాంచింగ్

By Surya PrakashFirst Published Apr 24, 2024, 1:43 PM IST
Highlights

 'వారసుడు' వచ్చి ఏడాది దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు పైడిపల్లి. ఏ హీరో కూడా వంశీ పైడిపల్లితో అర్జెంట్ గా సినిమా చేయటానికి ఉత్సాహం చూపించలేదు. 

కొన్ని సినిమాలు ఓవర్ నైట్ స్టార్స్ ని చేస్తే మరికొన్ని ఎడ్రస్ లేకుండా చేసేస్తాయి. అదే విధంగా లాస్ట్ ఇయిర్ సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వారసుడు మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు.తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించక బోల్తాపడింది. హిట్ అని ఎంత లేపుదామని ప్రయత్నించినా ఫలితం లేదు. టీవి సీరియల్ లా ఉందంటూ కామెంట్స్ రావటం దెబ్బ తీసింది. తమిళం, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు దాదాపు ఒకే రకమైన ఫలితం వచ్చింది. 
 
వారసుడు మూవీ రిలీజ్ విషయంలో దిల్ రాజు లెక్క తప్పింది.తెలుగులో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మరో విధంగా మైనస్ అయిందని కామెంట్లు వినిపించాయి. అయితే  దిల్ రాజు ఈ సినిమా తమిళ హక్కులు ముందుగానే అమ్మేయడంతో ఈ సినిమాకు నష్టాలు వచ్చినా దిల్ రాజుపై ఆ భారం పెద్దగా ఉండదని సమాచారం.తెలుగునాట వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉండటం వారసుడు సినిమాకు మైనస్ అయింది. అవన్నీ ప్రక్కన పెడితే దర్శకుడుగా వంశీ పైడిపల్లికి ఎన్నడూ రానంత బ్యాడ్ నేమ్ ఈ సినిమాతో వచ్చింది. ఇంత రొట్టకొట్టుడు సినిమా ఎలా తీసారని డైరక్ట్ గానే దుమ్మెత్తిపోసారు. 

 'వారసుడు' వచ్చి ఏడాది దాటిపోయినా.. ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు పైడిపల్లి. ఏ హీరో కూడా వంశీ పైడిపల్లితో అర్జెంట్ గా సినిమా చేయటానికి ఉత్సాహం చూపించలేదు. మరో ప్రక్క తెలుగు  టాప్ స్టార్స్ అంతా  వరస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో  ఇప్పుడు వంశీ దృష్టి బాలీవుడ్ పై పెట్టినట్లు తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) తో చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి, సినిమా చేయడానికి షాహిద్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నాడని చెప్పుకుంచున్నారు. దర్శకుడిగా వంశీ పైడిపల్లి కి  ఐదు దిల్ రాజు బ్యానర్ లో చేయటం కొత్తేమీ కాదు.

అలాగే  షాహిద్ కపూర్ కి తెలుగు డైరక్టర్స్  కొత్త కాదు. సందీప్ రెడ్డి వంగాతో 'కబీర్ సింగ్', గౌతమ్ తిన్ననూరితో 'జెర్సీ' చేశాడు. ఈ రెండు సినిమాలు తెలుగు రీమేక్ లే కావడం విశేషం. వాటిలో 'కబీర్ సింగ్' బ్లాక్ బస్టర్ గా నిలవగా.. 'జెర్సీ' మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇంకో విశేషమేంటంటే.. 'జెర్సీ' నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. ఆ పరిచయంతో షాహిద్ తో మరో ప్రాజెక్టు పట్టాలు ఎక్కిస్తున్నారని చెప్తున్నారు. అయితే తెలుగు సినిమా రీమేక్ అని వినిపిస్తోంది. అయితే ఏ రీమేక్ అనేది తెలియాల్సి ఉంది. 

click me!