
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిబులిటీస్ ఉన్న దర్శకుడు. ఆయన సినిమాలన్నీ చాలా యూనిక్గా ఉంటాయి. సమాజంలోని చాలా విషయాలను టచ్ చేస్తూ మంచి ఫీల్ గుడ్ చిత్రాలను అందిస్తారు. వాస్తవాలను చూపించే ప్రయత్నం చేస్తారు.
అదే సమయంలో చాలా సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ హృదయాన్ని కదిలిస్తుంటారు. ఇప్పుడు `కుబేర` చిత్రంతో రాబోతున్నారు. ధనుష్, నాగార్జున కలిసి నటించిన చిత్రమిది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది.
శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల తాజాగా మీడియాతో ముచ్చటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ `లీడర్ 2` గురించి ఓపెన్ అయ్యారు. ఈ మూవీ సీక్వెల్ గురించి తాను ఆలోచిస్తున్నట్టు తెలిపారు.
కథ పరంగా తనకు ఒక క్లారిటీ ఉందని, అయితే `లీడర్` సినిమా తీసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు అన్ని పరిస్థితులు మారిపోయాయి. దేశంలో, ప్రజల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆలోచనా విధానం మారింది.
ఇప్పటి జనాలు రాజకీయ నాయకులను కూడా మించిపోయారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీని ఎలా చేయాలనే సందేహం ఉంది. దీనిపై ఇంకా వర్క్ చేయాల్సి ఉందన్నారు శేఖర్ కమ్ముల. `లీడర్` మూవీ 2010 ఫిబ్రవరి 19న విడుదలై పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక `కుబేర` చిత్రం గురించి చెబుతూ, తన కెరీర్లో మొదటిసారి ఒక కామెంట్ చేశారు. బేసిక్గా శేఖర్ కమ్ముల తన సినిమాల గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పరు, తాను ఇలా చేశాను, అలా చేశానని ఎప్పుడూ చెప్పరు.
బాగా చేశానని, నచ్చుతుందని భావిస్తున్నట్టుగానే, నచ్చాలని కోరుకుంటున్నట్టుగానే చెబుతారు. కానీ `కుబేర` విషయంలో మాత్రం చాలా నమ్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. `ఈ మధ్య కాలంలో చాలా రకాల కథలతో సినిమాలు వస్తున్నాయి,
కానీ ఇలాంటి ఒక కథ నేను చెప్పినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ డెఫినెట్ గా చెప్పబడాలి. ఈ కథ అవేర్నెస్ ని తీసుకొస్తుంది. మంచి థ్రిల్లింగ్ పాయింట్` అని వెల్లడించారు.
`కుబేర` కథ గురించి చెబుతూ, `ఇది ఒక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం, బిలినియర్ వర్సెస్ బెగ్గర్. ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.
నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. అది కాస్త మెల్లగా ఒక ఎమోషనల్ థ్రిల్లర్ గా తయారయ్యింది. తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్, తనకి ప్రపంచంలో అన్ని కావాలనుకునే ఒక బిలినియర్, వారి మధ్య సంఘర్షణ ఉంటే, అది ఎలా ఉంటుందనేది చాలా ఇంట్రెస్టింగ్.
అదే ఈ మూవీ అని అన్నారు శేఖర్ కమ్ముల. `సినిమాని తెలుగు తమిళ్ రెండు భాషల్లో షూట్ చేశాం. కథపరంగా ఎలాంటి మార్పు ఉండదు కానీ నిడివిలో ఒక నిమిషం తేడా ఉంటుంది. లిప్ సింక్ పరంగా ప్రతిది విడివిడిగా తీశాం. టెక్నికల్ గా రెండు సినిమాలు తీసినట్లే. అందుకే కొంచెం టైం పట్టింద`న్నారు.
`కుబేర`లో నాగార్జునను తీసుకోవడం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, `కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో నాగార్జునని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది.
అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్ మ్యానరిజంతో చూపించాను. నాగార్జున `మనం`, `ఊపిరి` ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు.
ఈ క్యారెక్టర్ లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు. ఇక రష్మిక మందన్నా అందరిని సర్ప్రైజ్ చేస్తుంది. మంచి ఛాన్స్ వస్తే నెక్ట్స్ లెవల్లో నటించే హీరోయిన్ తను` అని వెల్లడించారు దర్శకుడు.
ధనుష్ని ఎంపిక చేయడంపై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, దేవా క్యారెక్టర్ ని ఆయన తప్పితే ఎవరూ చేయలేరు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కూడా ఇదే మాట చెబుతారు. అంతా అద్భుతంగా నటించాడు.
అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట. ఆ క్యారెక్టర్ లో ఇంకా ఎవరిని ఊహించలేరు. ఆయన సినిమా పూర్తి అయ్యేవరకూ ఆ క్యారెక్టర్ లోనే ఉంటారు. ఏదైనా సింగిల్ టేక్ లో చేసేస్తారు.
`కుబేర` సినిమాలో తన మార్క్ గురించి రియాక్ట్ అవుతూ, `నిజానికి నా మీద ఒక మార్క్ పడింది, కానీ నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయిన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉంటాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది` అని తెలిపారు.
`కథ డిమాండ్ మేరకు ముంబయి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాం. ముంబాయి షూట్ చాలా డిఫికల్ట్. అక్కడ పర్మిషన్స్ రావు. చాలా కండిషన్స్ ఉంటాయి. ముంబై వాళ్లే వేరే చోట షూట్ చేసుకుంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చేయడం అనేది చాలా చాలెంజింగ్ గా అనిపించింది. అందుకే గెరిల్లా ఫిల్మ్ మేకింగ్ ఫాలో అయినట్టు తెలిపారు దర్శకుడు. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉండదని, తనకు ఒక్క మూవీ చేయడమే కష్టమన్నారు.
25ఏళ్ల కెరీర్ గురించి, ఈ జర్నీ గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, `ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా తీశాను. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేశాను. ఈ జర్నీ అంత చూసుకున్నప్పుడు ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్రేక్షకులు చాలా ప్రేమని ఇచ్చారు. నాపై ఒక నమ్మకాన్ని ఉంచారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను.
అది చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. నా సినిమాల్ని అప్రిషియేట్ చేసి ఆడియన్స్ నాకు ఒక స్థాయిని ఇచ్చారు. అంతకంటే నేను ఏం కోరుకోను` అని తెలిపారు దర్శకుడు. ఇక నెక్ట్స్ నానితో ఒక మూవీకి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట.