
విక్రమ్ ప్రయోగాలకు కేరాఫ్గా నిలుస్తూ ఆకట్టుకున్నారు. ఇప్పటికీ ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకు వంతు వచ్చాయి. ధృవ విక్రమ్ సైతం అదే దారిలో వెళ్తున్నారు. తాజాగా ఆయన `బైసన్` అనే మూవీలో నటించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్ మీద పా. రంజిత్ సమర్పణలో సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా. రంజిత్, అదితి ఆనంద్ నిర్మించారు. ఈ చిత్రం గత వారం(అక్టోబర్ 17)న విడుదలై ఆకట్టుకుంటోంది. అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ని తెచ్చుకుంది. మరో `అసురన్`(నారప్ప)ని తలపించింది. మరి ఇప్పుడు తెలుగులో రిలీజ్ కాబోతుంది. ఈ నెల 24న తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా హీరో ధృవ్ విక్రమ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. `నేను కొన్ని రోజుల క్రితం ఇక్కడికి షాపింగ్ చేసేందుకు వచ్చాను. అక్కడ ఆ షాప్ ఓనర్ నన్ను చూసి ‘మీరు విక్రమ్లా ఉన్నారు’ అని అన్నారు. అవును.. నేను ఆయన కొడుకుని అని చెప్పాను. మా నాన్న గారి కష్టం, సినిమా కోసం చేసే ప్రయోగాల గురించి చాలా చెప్పారు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను ఆయన కొడుకుగా నాకు అన్నీ సులభంగానే అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించేందుకు చాలా కష్టపడతాను. నాకు తెలుగులో నటించాలని ఉంది` అని తెలిపారు.
ఈ మూవీ గురించి చెబుతూ, `బైసన్` కోసం మూడేళ్లు కష్టపడ్డాను. ఈ మూవీని చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి. నాన్నలానే నేను కూడా చాలా కష్టపడి వంద శాతం ఎఫర్ట్ పెడతాను. నా కొడుకు కూడా ఇలా వస్తే.. ‘మీ నాన్న ధృవ్ అంటే చాలా ఇష్టం’ అని చెప్పే స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. తమిళంలో మా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మారి సెల్వరాజ్ తన జీవితంలో ఎదురైన అనుభవాలు, చూసిన సంఘటనల నుంచే కథల్ని రాసుకుంటారు. పీపుల్స్ని ఎడ్యుకేట్ చేయాలని ఆయన పరితపిస్తుంటారు. అర్జున అవార్డు గ్రహీత మణతి గణేషన్ కథ ఆధారంగా ఈ మూవీని మారి సెల్వరాజ్ గారు తెరకెక్కించారు. ఈ మూవీ కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నంబర్స్ గురించి కాకుండా తెలుగులో మా సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరికీ మా చిత్రం నచ్చుతుంది. అక్టోబర్ 24న అందరూ చూడండి’ అని అన్నారు.
అనుపమ పరమేశ్వరణ్ మాట్లాడుతూ , `మారి సెల్వరాజ్ మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను. తమిళంలో ఆల్రెడీ ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. తెలుగులో రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా ఎక్కువైంది. ధృవ్కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందని, ఎంతో కష్టపడ్డాడు అని నేను రిలీజ్కు ముందు చెప్పాను. ఇప్పుడు అవే మాటలు ప్రేక్షకులు కూడా చెబుతున్నారు. ధృవ్తో నటించడం నాకు గర్వంగా ఉంది. నివాస్ మాకు అద్భుతమైన పాటలు, మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్` అని చెప్పారు.
నిర్మాత వీపీ సెల్వన్ బాలాజీ మాట్లాడుతూ .. ‘నా సోదరుడు చంద్రబోస్ వల్లే తెలుగులోకి ఈ మూవీని తీసుకు వస్తున్నాను. ఇది గొప్ప విజయం సాధిస్తుంది, చాలా మంచి చిత్రం అని లింగుస్వామి గారు మాకు సలహా ఇచ్చారు. ఈ మూవీని నేను చూశాను. తెలుగు ఆడియెన్స్కి తప్పకుండా కనెక్ట్ అవుతుందన్న నమ్మకం నాకు ఏర్పడింది. మాకు ఈ మూవీని ఇచ్చిన నీలం స్టూడియోస్, దీపక్, పా రంజిత్ గార్లకు థాంక్స్. ధృవ్ ఎంత కష్టపడ్డాడు అన్నది సినిమా చూస్తే అర్థం అవుతుంది. అనుపమ గారి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. తమిళంలో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. తెలుగు ఆడియెన్స్ ని కూడా ఆకట్టుకుంటుంది` అని చెప్పారు.