
బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. గత ఐదు సీజన్స్ ఊహకు మించిన ఆదరణ దక్కించుకున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 గత ఏడాది డిసెంబర్ లో గ్రాండ్ గా ముగిసింది. నటుడు సన్నీ సీజన్ విన్నర్ గా బిగ్ బాస్ టైటిల్ గెలుపొందారు. సీజన్ 5 ముగిసిన రోజుల వ్యవధిలో బిగ్ బాస్ డిజిటల్ వర్షన్ పై ప్రకటన చేశారు . బిగ్ బాస్ ఓటీటీకి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొన్నాళ్లుగా జరుగుతుంది.
కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తయింది. ఈ క్రమంలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. అరియానా, షణ్ముఖ్, దీప్తి సునైన వంటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ షోలో పాల్గొనబోతున్నట్లు పుకార్లు చక్కర్లు కొట్టాయి. వాస్తవంగా బిగ్ బాస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరో.. ఇంకా స్పష్టత రాలేదు.
కాగా నేడు బిగ్ బాస్ డిజిటల్ వర్షన్ స్ట్రీమింగ్ ప్రోమో విడుదల చేశారు. నాగార్జున(Nagarjuna)తో పాటు వెన్నెల కిషోర్, మురళీ శర్మ ప్రోమోలో అలరించారు. టెలివిజన్ లో బిగ్ బాస్ షో రోజుకు కేవలం ఒక గంట ప్రసారం అవుతుంది. వీకెండ్ తో పాటు ప్రత్యేక ఎపిసోడ్స్ లో రెండు నుండి మూడు గంటలు కొనసాగుతుంది. కానీ డిజిటల్ బిగ్ బాస్ షోకి అంతరాయం ఉండదు. వారంలో ఏడు రోజులు, 24 గంటలు కంటెస్టెంట్స్ పై కెమెరాలు అలానే ఉంటాయి. హౌస్ లో ప్రతి నిమిషం కంటెస్టెంట్స్ మధ్య జరిగే సందర్శనలు, భావోద్వేగాలు, కోపాలు, ప్రేమలు, అలకలు అన్నీ చూపిస్తారు.
ఇక బుల్లితెరపై షోకి కొన్ని పరిమితులు ఉంటాయి. డిజిటల్ వర్షన్ కి ఇవి చాలా తక్కువ. కాబట్టి మసాలా కంటెంట్ శాతం ఎక్కువగా ఉండే అవకాశం కలదు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg boss nonstop) ప్రోమో అలరిస్తుండగా... ఫిబ్రవరి 26 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక బిగ్ బాస్ డిజిటల్ స్ట్రీమింగ్ ఇప్పటికే కొన్ని భాషల్లో ప్రసారమై విజయం సాధించింది. కింగ్ నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వర్షన్ ఈ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.