తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయి. జూన్ 1 నుంచి థియేటర్లని బంద్ చేయబోతున్నట్టు ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని, పర్సంటేజ్ ప్రకారంగా చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ రోజు ఆదివారం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మధ్య చర్చలు జరిగాయి. తమకు పర్సంటేజ్ ప్రకారం చెల్లించాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి డిస్ట్రిబిటర్లు ఒప్పుకోవడం లేదు. దీంతో జూన్ 1 నుంచి థియేటర్ల బంద్కి ఎగ్జిబిటర్లు పిలుపు నివ్వడం గమనార్హం. ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఎఫ్డీసీ ఛైర్మెన్ దిల్రాజు, నిర్మాత సురేష్ బాబుతోపాటు పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇందులో పాల్గొన్నారు.
అద్దె పద్ధతిలో చెల్లింపులు చేయడం వల్ల తమకు వర్కౌట్ కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే, పర్సంటేజీ ప్రకారం చెల్లించలేమని డిస్ట్రిబిటర్లు తెగేసి చెబుతున్నారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజా సమావేశంలో ఈ పర్సంటేజీ, ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిగాయి. ఈ విషయంలో నిర్మాతలకు లేఖలు రాయాలని నిర్ణయించారు.
గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు పర్సంటేజీ ప్రకారంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం సినిమాకి వచ్చిన కలెక్షన్లలో ఎవరికి ఎంత చెల్లించాలనేది చూస్తే, (ఇవి నైజాం ఏరియా లెక్కలు)
ముప్పై కోట్లకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 75 శాతం కలెక్షన్లు డిస్ట్రిబ్యూటర్లకు, 25 శాతం ఎగ్జిబిటర్లకి చెందుతాయి. రెండో వారంలో 55 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 45 శాతం ఎగ్జిబిటర్లకి, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 60 శాతం ఎగ్జిబిటర్లకి, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 70 శాతం ఎగ్జిబిటర్లకు చెందేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇక 10-30 కోట్ల మధ్య హక్కులు కలిగిన సినిమాల విషయంలో మొదటివారం 60 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 40 ఎగ్జిబిటర్లకి, రెండో వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 50 శాతం ఎగ్జిబిటర్లకి, మూడో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 60 శాతం ఎగ్జిబిటర్లకి, నాలుగో వారం 30 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 70 శాతం ఎగ్జిబిటర్లకి ఇవ్వాలి.
పది కోట్ల లోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 50 శాతం ఎగ్జిబిటర్లకి, రెండో వారం 40 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 60 శాతం ఎగ్జిబిటర్లకి, మూడో వారంలో 30 శాతం డిస్ట్రిబ్యూటర్లకి, 70 శాతం ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.
మరి ఇదే విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని, దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. అందుకే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కి పిలుపినిచ్చారు. జూన్ తర్వాతనే పెద్ద సినిమాల రిలీజ్లున్నాయి. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం నిర్మాతలకు పెద్ద షాక్ తగిలినట్టయ్యింది.