ఎన్టీఆర్‌కి బిడ్డగా పుట్టడం నా పూర్వజన్మసుకృతం.. బాలకృష్ణ ఎమోషనల్‌ కామెంట్స్

By Aithagoni RajuFirst Published Jan 18, 2023, 1:42 PM IST
Highlights

ఎన్టీఆర్‌కి కుమారుడిగా జన్మించడం తన పూర్వజన్మసుకృతం అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు(జనవరి 18) బుధవారం ఎన్టీఆర్‌ 27వ వర్థంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించారు.

ఎన్టీఆర్‌కి కుమారుడిగా జన్మించడం తన పూర్వజన్మసుకృతం అని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు(జనవరి 18) బుధవారం ఎన్టీఆర్‌ 27వ వర్థంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ ఎన్టీఆర్‌ ఘాట్‌ని సందర్శించారు. ఎన్టీఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి తండ్రిని స్మరించుకున్నారు. ఆయనతోపాటు అన్న రామకృష్ణ, అలాగే  సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు,  టీడీపీ నేతలున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చింది,  మీ అందరిగుండెల్లో తన ప్రతిరూపంగా నిలిపిన ఎన్టీఆర్‌కి వందనాలు. విశ్వానికే నటవిశ్వరూపం అంటే ఏంటో తెలియజేసి విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్‌ అని తెలిపారు. ప్రజల భవితకు భరోసా ఇచ్చిన అమ్మ, ఆడవాళ్లకి అండగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని ఇచ్చిన అన్న నందమూరి తారకరామారావు. అలాంటి మహానుభావుడిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా  తీసుకోవాలని తెలిపారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని సంపాదించుకోవడం ఎన్టీఆకే సాధ్యమైందన్నారు. 

టీడీపీ ఎన్టీఆర్‌ ఇచ్చిన గొప్ప ఆస్తి. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదు, ఒక వ్యవస్థ,  తెదేపాకు ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని  చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బడుగు, బలహీన,  వెనకబడిన వర్గాల  అభ్యున్నతికి  ఆయన ఎంతో చేశారు. ఆయన  తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొన్నారు. ఎప్పుడూ కూడా ఆయన తలవంచకుండా ముందుకు వెళ్లారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్‌. 

ప్రపంచంలో ఎక్కడ వెతికినా ఇలాంటి నటుడు దొరకడని, నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు. ప్రతి పాత్రలో పరాకాయ ప్రవేశం చేసి పాత్రకి ప్రాణం పోశారని తెలిపారు బాలయ్య. ఆయన లాంటి నటుడు ఎక్కడ కనిపించరు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రతి తెలుగు బిడ్డకి, మట్టికి తాను తెలుగువాడిని అని చాటి చెప్పిన ఘనత ఆయన సొంతం. తాను తెలుగు వాడిని అని చెప్పుకునే దమ్ము, ధైర్యం, తెగువ, ఆత్మ విశ్వాసం, పొగరుకి సానబెట్టి,  పదునుబెట్టి బయటకు లాక్కొచ్చి చెప్పించిన సత్తా ఆయన సొంతమన్నారు బాలయ్య. ఆయనకు కొడుకుగా  పుట్టడం తన  పూర్వజన్మసుకృతం అని తెలిపారు. 

బాలకృష్ణ ఇటీవల `వీరసింహారెడ్డి` చిత్రంలో నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన  ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి హాసన్‌, హనీ రోసీ కథానాయికలుగా నటించారు. కన్నడ నటుడు దునియా  విజయ్‌ విలన్‌ పాత్ర పోషించగా, వరలక్ష్మి కీలక పాత్రలో మెప్పించింది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మించారు. ఇక ప్రస్తుతం బాలయ్య.. అనిల్‌ రావిపూడితో ఓ సినిమా చేస్తున్నాడు. 

click me!