మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ రావు కన్నుమూశారు.
పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ కమ్ ప్లే బ్యాక్ సింగర్ రఘు కుంచె తండ్రి లక్ష్మీనారాయణ రావు కన్నుమూశారు. మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1933లో జన్మించిన లక్ష్మీనారాయణ వయస్సు 90 సంవత్సరాలు. ఆయన పేరు భార్య వరహాలమ్మ. వీరికి రఘు కుంచె కుమారుడు. అలాగే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడ వీరి స్వగ్రామం. ఆయన వ్యవసాయం చేశారు. అలాగే హోమియో వైద్యుడిగా సేవలు అందించారు . స్థానిక నీటి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. రఘు కుంచె తండ్రి మృతి వార్త తెలిసిన పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా నటుడిగా, ప్లే బ్యాక్ సింగర్ గా రఘు కుంచె పరిశ్రమలో అడుగుపెట్టారు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన బాచి మూవీలో ఆయన నటించారు. అలాగే ఆ చిత్రంలో ఓ సాంగ్ పాడారు. పూరి జగన్నాధ్ ఆయనకు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఆఫర్ ఇచ్చారు. 2009లో విడుదలైన బంపర్ ఆఫర్ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. రఘు కుంచె పలాస 1985 మూవీలో కీలక రోల్ చేశారు. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేశారు.