
టాలీవుడ్లో ఇటీవల చిన్న సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. `బలగం`, `సామజవరగమన`, `రైటర్ పద్మభూషణ్` వంటి చిత్రాలు ఇటీవల సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు వాటికి బాబు లాంటి సినిమాగా మారింది `బేబీ`. ఈ చిత్రం చిన్న సినిమాల్లో సరికొత్త సంచలనంగా మారింది. `జాతిరత్నాలు` తరహాలో ఈ సినిమా దుమారం రేపుతుంది. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలుస్తుంది. కలెక్షన్ల పరంగా సరికొత్త సంచలనం సృష్టిస్తుంది.
తాజాగా ఈ సినిమా కేవలం ఎనిమిది రోజుల్లోనే యాభై కోట్ల మార్క్ ని దాటింది. ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఏకంగా 54కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ లెక్కన ఇది సుమారు రూ.25కోట్లకుపైగానే షేర్ సాధించింది. కేవలం 14కోట్ల బడ్జెట్తో, 16కోట్ల(థియేట్రికల్, డిజిటల్) ప్రీ రిలీజ్ బిజినెస్తో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నేటి యువత తీరుతెన్నులను ఆవిష్కరించే కథాంశంతో, బోల్డ్ కంటెంట్తో రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. నయా ట్రెడ్ని క్రియేట్ చేసింది.
చిన్న మీడియం రేంజ్ సినిమాల్లో ఇది అత్యంత వేగంగా యాభై కోట్లు దాటిన సినిమాగా నిలవడం విశేషం. ఈ వారం విడుదలైన సినిమాలు ఏదీ పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడంతో రెండో వారంలోనూ `బేబీ` జోరుకొనసాగనుంది. పైగా యూత్కి ఈ చిత్రం బాగా ఎక్కింది. టీనేజర్లు, స్కూల్ నుంచి కాలేజీల వరకు అందరు స్టూడెంట్స్ ని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. పైగా కాలేజీల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. అలా రియలిస్టిక్ కంటెంట్ కావడంతో స్టూడెంట్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు.
ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో దర్శకుడు సాయి రాజేష్ `బేబీ` సినిమాని రూపొందించారు. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కేఎన్ దీన్ని నిర్మించారు. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి నటన, విజయ్ బుల్గానిన్ సంగీతం, విజువల్స్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్లా నిలిచాయి.ఈ సినిమాకి విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం కూడా కలిసొచ్చింది. అలాగే రష్మిక మందన్నా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది.
`బేబీ` కథ గురించి చూస్తే, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి స్కూల్ డేస్నుంచి ప్రేమించుకుంటారు. టెంన్త్ ఫెయిల్ అయిన ఆనంద్ ఆటో కొనుకుని దాన్ని నడిపిస్తుంటాడు. వైష్ణవి పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలకు బీటెక్ చేస్తుంది. అక్కడ విరాజ్ అశ్విన్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. గిఫ్ట్ లతో వైష్ణవిని తన దగ్గర చేసుకుంటాడు. తనని ప్రేమించాలని ఒత్తిడి తెస్తాడు. తనని వదిలించుకోవడానికి చివరి అంకానికి తెగిస్తుంది వైష్ణవి.. ఈ విషయం తెలిసి ఆనంద్ పిచ్చోడైపోతాడు. తనని మోసం చేసిందని బాధ పడతాడు. చివరికి ఎలాంటి ముగింపు ఉందనేది సినిమా.
ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ, `నా మ్యూజిక్ అంటే సాయి రాజేష్ గారికి ఇష్టం. నాతో పని చేస్తారా? అని ఓ సారి అడిగారు. ఓకే అన్నాను. కష్టంగా ఉండే పాటలు ముందు చేద్దామని నేను అన్నాను. ప్రేమిస్తున్నా పాటను ముందు కంప్లీట్ చేశాం. ఆ పాట సాయి రాజేష్ కి బాగా నచ్చింది. ఆ పాటను రెండు మూడు రోజుల్లోనే పూర్తి చేశాను. మెలోడీ పాటను చేయగలిగితే.. ఏ పాటనైనా కంపోజ్ చేయగలమని నా నమ్మకం. మాస్ పాటలోనైనా మెలోడీ ఉంటేనే ఎక్కువ రోజులు గుర్తుంటుందని నా అభిప్రాయం. నా మ్యూజిక్కు అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విజయ్ దేవరకొండ గారు చెప్పిన మాటలు, నాని గారి మెసెజ్ నాకు స్పెషల్. ప్రతీ సినిమాకు నా బెస్ట్ ఇచ్చాను. కానీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
సాంగ్స్ కంపోజ్కు ఎక్కువ రోజులు పట్టలేదు. ఓ రెండు మేఘాలిలా అనే పాటను కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేశాం. ప్రతీ పాటలో మెలోడీ ఉంటుంది. అందుకే బ్యాక్ గ్రౌండ్లో కూడా ఆ పాటల ట్యూన్నే వాడాం. సాయి రాజేష్ గారితో పని చేయడం ఇబ్బందిగా అనిపించలేదు. మ్యూజిక్, ఆర్ఆర్ విషయంలో మా ఇద్దరిలో ఎవరు మాట్లాడేదాంట్లో సెన్స్ ఉంటే ఆ టైంకి వాళ్ల మాట వినేవాళ్లం. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూద్దామని అన్నాను. ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అల్లు అరవింద్ లాంటి వాళ్లు కూడా అడుగుతున్నారు (నవ్వుతూ)` అని తెలిపారు.