
కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి త్రివిక్రమ్, అల్లు అర్జున్. మొదట వాళ్ళిద్దరూ కలిసి 'జులాయి' చేశారు. ఆ సినిమా ప్రేక్షకులతో పాటు అల్లు అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ఆ తర్వాత చేసిన సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత చేసిన 'అల వైకుంఠపురములో' సినిమా అయితే మామూలు హిట్ కాదు. ఇండస్ట్రీ రికార్డులు బ్రద్దలు కొట్టింది. 'అల...' విడుదలైన తర్వాత గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇప్పుడు మరో ప్రాజెక్టుకు కలవబోతున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ బిజినెస్ లెక్కలు మారాయి. పుష్ప తర్వాత బన్ని ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యారు. దాంతో బన్ని ఇమేజ్ కు తగిన కథతోనే తెరకెక్కించాలి.
లోకల్ ప్లేవర్ కథ కాకుండా దేశం మొత్తం నచ్చే కాన్సెప్టు అయ్యిండాలి. డైలాగులుతో కాకుండా యాక్షన్ తో నడిపే కథ అయ్యిండాలి.త్రివిక్రమ్ ఇప్పుడు ఆ విషయమై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ తన స్టైల్ మారుస్తారా లేక ప్యాన్ ఇండియా సినిమానే తన స్టైల్ లో చేస్తారా చూడాల్సి ఉంది. అయితే ప్యాన్ ఇండియా ఇప్పుడు చాలా మంది స్టార్ దర్శకులకు కొరకరాని కొయ్యగా మారిందని, హీరోలు ఏమో ఓ పట్టాన మామూలు కథలు ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు
ఇక 'అల వైకుంఠపురములో' సినిమాను అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మళ్ళీ ఆ రెండూ కలిసి కొత్త సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. రీసెంట్ గా మళయాళ డబ్బింగ్ '2018' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన 'బన్నీ' వాసు, వచ్చే ఏడాది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ఉంటుందని చెప్పారు. ఆ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా... పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కథపై త్రివిక్రమ్ వర్క్ చేయడం ప్రారంభిస్తారని సమాచారం.