సుశాంత్ నివసించిన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి యజమానులు సిద్ధం అయ్యారు. నెలకు రూ . 4 లక్షలు కిరాయిగా నిర్ధారించి యజమానులు ఈ మేరకు ప్రకటన చేసినట్లు సమాచారం.
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో సంచలనం రేపింది. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన ఆయన మరణం బాలీవుడ్ పెద్దలపై వ్యతిరేకతను రగిలించింది. కరణ్ జోహార్, సల్మాన్, కరీనా కపూర్, అలియా భట్, మహేష్ భట్ వంటి బాలీవుడ్ ప్రముఖులను సోషల్ మీడియా వేదికగా సుశాంత్ అభిమానులు, సానుభూతి పరులు ట్రోల్ చేశారు. సుశాంత్ మరణానికి కారకులు వీరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
అనేక మలుపు తిరిగిన సుశాంత్ డెత్ కేసును పోలీసులు, వైద్యులు ఆత్మహత్యగానే నిర్ధారించారు. జూన్ 14నాటికి సుశాంత్ మరణించి ఏడాది పూర్తి అయ్యింది. ఆయన మొదటి వర్థంతి నాడు సోషల్ మీడియా వేదికగా చిత్ర ప్రముఖులు, ఫ్యాన్స్ నివాళులు అర్పించారు. కాగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న అపార్ట్మెంట్ ఏడాది కాలంగా ఖాళీగానే ఉంటుంది.
తాజాగా సుశాంత్ నివసించిన ఇంటిని అద్దెకు ఇవ్వడానికి యజమానులు సిద్ధం అయ్యారు. నెలకు రూ . 4 లక్షలు కిరాయిగా నిర్ధారించి యజమానులు ఈ మేరకు ప్రకటన చేసినట్లు సమాచారం. సుశాంత్ ఆ లగ్జరీ అపార్ట్మెంట్ ని నెలకు రూ. 4.5 లక్షల చొప్పున మూడేళ్లకు లీజుకు తీసుకున్నారట. అయితే గడువు ముగియక ముందే ఆయన మరణించడం జరిగింది. దీనితో ఆయన మరణించిన ఏడాది అనంతరం అపార్ట్మెంట్ యజమానులు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.