
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై అభినందనల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నారా చంద్రబాబు నాయుడికి.. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు.
ఎక్స్ వేదికగా ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, భరత్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్లకు తారక్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన మామయ్య.. బాబాయ్, అత్తయ్యా అంటూ జూనియర్ ట్వీట్ చేయడంతో అందరూ ఆసక్తిగా ఈ ట్వీట్ గురించి మాట్లాడుతున్నారు. వైరల్ చేస్తున్నారు.
" ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్కు, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. తారక్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఎక్స్ వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు.