ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో ఓబుల్రెడ్డి స్కూల్లో...
ఎదుటివాళ్లు ఏ ఆలోచనతో ఉన్నా తమకు కావాల్సినట్లు తమకు అనుకూలమే అంటూ ప్రచారం చేస్తూ మలుచుకుంటారు కొందరు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను వైరల్ చేసి జనాల్లోకి తీసుకెళ్తూంటారు. ఆ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని ఊహించని విధంగా వైరల్ అవుతూండటం గమనించవచ్చు. తాజాగా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎన్టీఆర్ షర్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు రాష్ట్రాల్లోనూ 42 లోక్ సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. హీరో ఎన్టీఆర్ ఉదయమే తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో ఓబుల్రెడ్డి స్కూల్లో భార్య ప్రణతి, తల్లి షాలిని కలిసి వెళ్లి, సామాన్యుడిలా క్యూలో నిలబడి మరీ ఓటు వేశారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఎన్టీఆర్ నెట్టింట్లో ట్రెండింగ్గా మారారు. అందుకు కారణం పోలింగ్కి ఆయన వేసుకొచ్చి చొక్కానే. ఆయన బ్లూ షర్ట్ ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. దీంతో ఎన్టీఆర్ పరోక్షంగా వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చారంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తమకు మద్దతుగానే ఎన్టీఆర్ బ్లూషర్ట్ వేసుకొచ్చాడంటూ వైఎస్సార్సీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫోటోని వైరల్ చేయటం గమనించవచ్చు.
వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం కూడా చేసారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా సినిమాలపైనే ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్న ఆయన హిందీ సినిమా వార్ 2 కూడా చేస్తున్నారు.