టెక్నాలజీ కారణంగా ఎన్ని లాభాలు ఉన్నాయ్ అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఈ టెక్నాలజీ కారణంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెలబ్రిటీకు సంబంధించిన సోషల్ మీడియా ఎకౌంట్లు హ్యాక్ అయిన వార్తలు తరుచూ వినిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్కు ఎదురైంది. ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేసిన కొంత మంది ఆకతాయిలు మార్ఫింగ్ ఫోటోలను ఆమె ఎఫ్ బీ పేజ్లో ఫోస్ట్ చేశారు.
దీంతో ఆవేదన చెందిన అనుపమా తన ఆవేదనను వ్యక్తం చేశారు. `కొంత మంది వెదవలు నా అకౌంట్ను హ్యాక్ చేశారు. ఇలాంటి చెత్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేంత ఖాళీగా ఉన్న వాళ్లకు.. మీకు అమ్మ.. అక్కా లేరా..? మీ తెలివి తేటలను మంచి పనికోసం వినియోగించండి. ఇలాంటి చెత్త పనుల కోసం కాదు` అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
మలయాళ సూపర్ హిట్ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అందాల భామ అనుపమా పరమేశ్వరన్. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ తరువాత తెలుగులోనూ తన మార్క్ చూపించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అనుపమా. తెలుగులో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలోనూ తన మార్క్ చూపించింది.
సినిమాలో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. తన సినిమాల విశేషాలతో పాటు ఫ్రీ టైంలో తాను ఇంట్లో కుటుంబం సభ్యులతో కలిసి చేసే సరదా సరదా పనులను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది అనుపమా. ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటో షూట్ లను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసేకుంటుంది అనుపమా.