సీమ ‘పరిటాల’కు ఇచ్చిన విలువ తెలంగాణ ‘దేశిని’ కి లేదా?

First Published Nov 13, 2017, 7:12 PM IST
Highlights

తెలంగాణ బడుగుల బిడ్డకు ఇంత అవమానమా? ' దేశిని చిన మల్లయ్య ' కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక దహన సంస్కారాలు చేయకపోవడం బాధాకరం! ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ భౌతిక కాయాన్ని సందర్శించ లేదు. 

అనంతపురంలో జరిగిన పరిటాల శ్రీరామ్ వివాహానికి వెళ్లిన సీఎం కేసీఆర్ గారు 10సంవత్సరాల క్రితం మరణించిన పరిటాల రవీంద్ర సమాధిని సందర్శించడానికి సమయం ఇవ్వగలిగారు. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, రాజకీయ అరంగేట్రం చేసి, బలహీన వర్గాల, కార్మిక, కర్షక నాయకుడిగా అదీ కాకుండా టిఆర్ఎస్ ఆవిర్భావ నిర్మాణంలో ఉన్న అతికొద్దిమంది నాయకులలో దేశిని చిన మల్లయ్య కూడా ఒకరు.

 శ్రీ దేశిని చిన మల్లయ్య 20 సంవత్సరాల పాటు సర్పంచ్ గా 4 పర్యాయాలు 20 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన హైదరాబాద్ లో దివంగతులు అయితే, హైదరాబాద్ లో ఉన్న ముఖ్యమంత్రి గానీ మంత్రులకు కానీ వారి దేహాన్ని సందర్శించడానికి సమయం కేటాయించకపోవడం బాధాకరం కాదా?

తెరాస ప్రభుత్వం గడుస్తున్న మూడున్నర సంవత్సరాలలో దేశిని చిన మల్లయ్య స్థాయి ఉన్న నాయకులకు, ప్రముఖులకు కూడా అధికార లాంఛనాలతో కార్యక్రమాలు నిర్వహించింది. ఇంకో మాటలో చెప్పాలంటే దేశిని కంటే తక్కువ స్థాయి, చిన్న స్థాయిలో ఉన్న నాయకులకు కూడా నిర్వహించింది.

దేశిని చిన మల్లయ్య కు అధికార లాంఛనాలతో చేయకపోవడం సామాజిక(కులం) పరిస్థితులే కారణమా..? లేక ఆయన డబ్బులు సంపాదించకపోవడం నేరమా..? ఈ పరిస్థితిని మేధావులు, విశ్లేషకులు, ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది..! తెలంగాణ వ్యతిరేకులు, సీమాంధ్ర వాసులకు సైతం అధికారిక లాంఛనాలు దక్కిన నేలమీద తెలంగాణ ముద్దు బిడ్డను విస్మరించడం బాధాకరమే. తెలంగాణ బడుగు బిడ్డలకు టిఆర్ఎస్ సర్కారు ఇచ్చే గౌరవం ఇదేనా?

 

ఇట్లు 

శ్రీకాంత్ దాసరి, 

సిద్ధిపేట జిల్లా.

 

( *రచయిత సామాజిక ఉద్యమకారుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్.)

click me!