వరదల్లో ఏపి ఇసుక హైదరాబాద్ కు కొట్టుకుపోతోందా...?: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సెటైర్లు

Published : Nov 05, 2019, 07:22 PM IST
వరదల్లో ఏపి ఇసుక హైదరాబాద్ కు కొట్టుకుపోతోందా...?: జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సెటైర్లు

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లోొ అసమర్థ పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. ఇసుక కొరతతో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా అర్థం కావడం లేదన్నారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.  
పరిశీలకుల శిక్షణా శిబిరంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన టిడిపి రాష్ట్ర పార్టీ నాయకులు, సంస్థాగత ఎన్నికల పరిశీలకులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. 

అలాగే రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్యపై మాట్లాడుతూ అధికార పార్టీ నాయలకుపై చంద్రబాబు ద్వజమెత్తారు. ఇసుక నిల్వలు వరదల్లో కొట్టుకుపోయాయని మంత్రి సురేష్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా వున్నాయని  మండిపడ్డారు. ఇసుక వరదల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు కొట్టుకుపోయాయా అంటూ ఎద్దేవా చేశారు. 

''కాలం చెల్లి చనిపోయారని'' మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భవన నిర్మాణ కార్మికులను అవమానించారని మండిపడ్డారు. ఉరేసుకుని చనిపోవడం కాలం చెల్లడమా..? భవనంపై నుంచి దూకడం కాలం చెల్లడమా..? పురుగుమందు తాగి చనిపోవడం కాలం చెల్లడమా..? అంటూ ప్రశ్నించారు. మంత్రుల వ్యాఖ్యలు సీఎం జగన్  వాఖ్యానాలేనని... బాధ్యతా రాహిత్యానికి వైసిపి నేతలే మారుపేరుగా నిలిచారని తెలిపారు. 

ఏమాత్రం మానవత్వం లేని ప్రభుత్వం ఇదని అన్నారు. చనిపోయినవారిని కూడా అవమానించే ప్రభుత్వం ఇదన్నారు. ఒక వ్యక్తి మారితే ఇంత అరాచకమా..? చరిత్రలో  చాలామంది ముఖ్యమంత్రులు మారారన్నారు. కొంతమంది ప్రజాదరణ పొందారు, కొందరు ప్రజాదరణ పొందలేదని.... ఎవరూ ఇంత డేమేజి రాష్ట్రానికి చేయలేదన్నారు. 

read more video: జగన్ సొంత జిల్లాలో దారుణం: ఎమ్మార్వో కార్యాలయంలోనే అన్నదాత ఆత్మహత్యాయత్నం

చేతకాని పాలనకు ఇసుక కొరత-కార్మికుల అత్మహత్యలే ఒక కేస్ స్టడిగా పేర్కొన్నారు. ఎంత ఆవేదనకు లోనైతే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు భవనంపై నుంచి దూకి ఒకరు, ఉరివేసుకుని ఇంకొకరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. 10రోజుల్లో దాదాపు 40మందిపైగా ఆత్మహత్యలు చేసుకోవడం వైసిపి నేతల అరాచకాలకు నిదర్శనమన్నారు.

రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత తీవ్రతకు ఈ ఆత్మహత్యలే అద్దం పడుతున్నాయన్నారు. .ఇసుక కొరతకు నిరసనగా ఆందోళనలకు శ్రీకారం చుట్టింది టిడిపినేని గుర్తుచేశారు. ఆగస్ట్ 30న రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేశామని...అక్టోబర్ 25న రాష్ట్రవ్యాప్త నిరసనలు చేశామన్నారు.  విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ కు మద్దతిచ్చామని....ఎవరు ఆందోళనలు చేసినా టిడిపి సంఘీభావంగా ఉంటుందన్నారు. వచ్చే వారం ఇసుక కొరతపై 12గంటల దీక్ష చేస్తానని తెలిపారు. 

అప్పట్లో వనజాక్షి అంశంపై దుష్ప్రచారం చేశారని... డ్వాక్రా మహిళలు, అధికారిణి మధ్య వివాదాన్ని రాజకీయం చేశారన్నారు. చింతమనేని ప్రభాకర్ పై అక్కసుతో టిడిపిని టార్గెట్ చేశారని దానిపై వన్ మ్యాన్ కమిషన్ వేసి పరిస్థితిని చక్కదిద్దామని తెలిపారు. టిడిపి 5ఏళ్ల పాలనలో అదితప్ప మరో సంఘటన జరగలేదన్నారు. 

టిడిపి పాలనలో ఇసుక, మట్టి ఉచితంగా తీసుకెళ్లమన్నామని... దీనివల్ల నిర్మాణాలన్నీ శరవేగంగా జరిగాయన్నారు. దీంతో లక్షలాది మందికి ఉపాధి వచ్చిందన్నారు. కానీ ఈ 5నెలల్లోనే వైసిపి నేతల విధ్వంసానికి హద్దు అదుపు లేకుండా పోయిందని విమర్శించారు.  వైసిపి నేతల ఇసుక దోపిడి పేట్రేగి పోవడంతో  ఇసుక కొరత జఠిలంగా మారిందన్నారు. 

ఈ ఇసుక కొరత వల్ల అనేక వృత్తులవారు జీవనోపాధి కోల్పోయారని తెలిపారు. తాపీ కార్మికులు, రాడ్ బైండింగ్ పనివాళ్లు, ట్రాన్స్ పోర్ట్ కార్మికులు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, స్టీల్, సిమెంట్ లోడింగ్ అన్ లోడింగ్ కార్మికులు ఉపాధి పోయిందన్నారు. ఇసుక కొరత కార్మికుల ఆత్మహత్యలపై జాతీయ మీడియా ఎండగట్టిందని ఆరోపించారు.

read more  తీరు మార్చుకో...లేదంటే రాజకీయాలకే పనికిరాకుండా పోతావ్..: పవన్ కు అవంతి హెచ్చరిక

ఉచిత ఇసుక పంపిణీ అన్ని సమస్యలకు పరిష్కారం కాదని పరిహారం ఇస్తే కార్మికులకు విశ్వాసం పెరిగి ఓ నమ్మకం వస్తుందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్ధికసాయం ఇచ్చినట్లు,  మగ్గం గుంతల్లోకి వరదనీరు వస్తే చేనేత కార్మికులకు ఆర్ధిక సాయం ఇచ్చినట్లు, విపత్తులలో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చినట్లే భవన నిర్మాణ కార్మికులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ప్రతి కార్మిక కుటుంబానికి నెలకు రూ.10వేల చొప్పున అందజేయాలన్నారు. అలాగే ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. ఎన్ఏసి కింద అసంఘటిత కార్మికుల సంక్షేమ నిధిని తామే తెచ్చామని.... దానికింద పుష్కలంగా నిధులు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.  అందులోనుంచి నిధులు విడుదలచేసి కార్మికులను ఆదుకోడానికి కూడా వైసిపి నేతలకు చేతులు రావడంలేదని మండిపడ్డారు. 

ప్రతి గురువారం అడ్వకేట్లతో భేటి అవుతున్నానని.... కార్యకర్తలపై అక్రమ కేసులను లీగల్ సెల్ సమగ్రంగా పరిశీలిస్తోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అన్నివిధాలా అండగా  ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే
IMD Cold Wave : హమ్మయ్యా..! ఇక చలిగండం గట్టెక్కినట్లేనా..?