200 మీటర్ల దూరం...50 అడుగుల లోతు...: కచ్చులూరు బోటు ఆచూకీపై క్లారిటీ

By Arun Kumar PFirst Published Oct 18, 2019, 3:25 PM IST
Highlights

ఆపరేషన్ రాయల్ వశిష్ట పనుల్లో పురోగతి కనిపించింది. గోదావరి నదిలో మునిగిపోయిన బోటు కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్న బృందానికి బోటూ ఆచూకీకి సంబంధించిన కీలక సమాచారం  దొరికింది.  

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గత నెలలో(సెప్టెంబర్) ప్రమాదానికి గురయిన బోటు ఆచూకీపై క్లారిటీ వచ్చింది. ఇంతకాలం మునిగిపోయిన రాయల్ వశిష్ట ఎక్కడుందో కూడా తెలియలేదు. కానీ బోటు వెలికితీత పనులు చేపడుతున్న దర్మాడి సత్యం బృందం ఎట్టకేలకు బోటు ఆచూకిని కనిపెట్టింది.

ఆపరేషన్ రాయల్ వశిష్ట పనులు చేపడుతున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న దర్మాడి సత్యం ఈ వివరాలను వెల్లడించారు. దాదాపు 50 అడుగుల లోతులో, ఒడ్డుకు 200 మీటర్ల దూరంలో వశిష్ట బోటు ఉన్నట్లు కన్పర్మ్ అయ్యిందని తెలిపారు. దేవుడిగొంది ఇసుక తిన్నె వద్ద ఒడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో బోటు ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఈ రోజు(శుక్రవారం) విశాఖపట్నం నుంచి కొందరు డైవర్లు వస్తారని అన్నారు. వీరి సాయంతో బోటుకు సంబంధించిన మరింత సమాచారాన్ని రాబడతామని సత్యం పేర్కొన్నారు.  కాకినాడ పోర్టు అధికారి కెప్టెన్ ఆది నారాయణ ఆధ్వర్యంలో ఈ బోటు వెలికితీత పనులు కొనసాగుతున్నాయి. 

గురువారం ధర్మాడి సత్యం బృందం నదిలో వేసిన లంగర్‌కు బోటు రెయిలింగ్ తగిలింది. దానిని రోప్ సాయంతో లాగినప్పుడు రెయిలింగ్ ఊడి వచ్చింది. బోటు గాలింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టుకు చెందిన సీనియర్ అధికారి  ఆదినారాయణ... సత్యం బృందంతో కలిసి బోటు మునిగిన చోటుకు నాటు పడవతో వెళ్లారు.

అంచనా వేసిన ప్రదేశం దగ్గర లంగర్‌ వేసి పలు సూచనలు చేశారు. అనంతరం తాడును గోదావరి బయటకు తీసుకొచ్చి ప్రొక్లెయిన్‌తో లాగారు. ఈ క్రమంలో బోటు ముందు భాగంలో ఉండే రెయిలింగ్ ఊడిపోయి పైకి రావడంతో గాలింపు సిబ్బంది, ధర్మాడి సత్యం బృందంలో ఆశలు చిగురించాయి.

రెయిలింగ్ చిక్కిన దానిని బట్టి బోటు ఎడమ వైపుకు పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. బోటును లాగుతున్న సమయంలో డీజిల్ మరకలు తెట్టుగా పైకి వచ్చాయని ఆ ప్రాంతంలో ఎక్కువగా బుడగలు వస్తున్నాయని... శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో బోటును బయటకు తీసే అవకాశం ఉందని ధర్మాడి సత్యం ఆశాభావం వ్యక్తం చేశారు.

గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో వెలికీతత పనులకు అవకాశం ఇవ్వాల్సిందిగా ధర్మాడి సత్యం ప్రభుత్వాన్ని కోరాడు. దీనికి అంగీకరించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ సామాగ్రిని కచ్చులూరు వద్దకు తరలించుకోవచ్చని తెలిపారు. దీనిలో భాగంగా బుధవారం మొదటి విడతలో వేసిన లంగర్‌ కంటే పెద్ద లంగర్‌ను వేసింది.

మొదటి విడతలో లంగర్‌కు ఏదో ఇనుప వస్తువు తగిలినట్లు భావించి.. దానిని ప్రొక్లెయిన్ సాయంతో బయటు లాగేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఇనుప రోప్  తెగిపోవడంతో దానిని విరమించుకున్నారు. 

గత నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో  మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో పాపికొండలు వెళ్తున్నరాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది. ఈ ప్రమాదం నుండి సుమారు 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 38 మృతదేహాలు లభ్యం కాగా మరో 13 మంది ఆచూకీ గల్లంతైంది. 

 బోటు ప్రమాదంలో ఆచూకీ లేకుండా పోయిన వారు మృతి చెందినట్టుగానే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని కూడ ఏర్పాటు చేసింది.

click me!