మీరసలు రాయలసీమ బిడ్డలేనా...: జగన్, చంద్రబాబులపై బిజెపి నేత ఫైర్

By Arun Kumar PFirst Published Oct 31, 2019, 9:29 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులపై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి ఫైర్ అయ్యారు. అసలు వారు రాయలసీమ బిడ్డలేనా...అంటూ విమర్శించారు. 

రాయలసీమకే చెందిన సీఎం జగన్... మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబులపై బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు డాక్టర్ పార్థసారథి ఫైర్ అయ్యారు. సీమలో ఉద్యమాల ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా ఈ పెద్దమనుషులు పట్టించుకోకపోవడం ఇక్కడి ప్రజలపై వారికున్న ప్రేమను తెలియజేస్తుందని వ్యంగ్యంగా అన్నారు. కర్నూలు నగరంలోని బళ్లారి చౌరస్తాలో ఉన్న తన నివాసంలో బీజేపీ జిల్లా నాయకులతో కలసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా... రాయలసీమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వైఎస్సార్‌సిపి, టిడిపిలు  నిర్లక్ష్యం చేస్తున్నారయని ఆరోపించారు. 

45 రోజులుగా రాజధాని, హైకోర్టు కావాలని ఉద్యమిస్తుంటే వారి నుండి కనీస స్పందన లేదన్నారు. రాయలసీమ ఓట్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలైన వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు. రాయలసీమకు చెందిన సీఎం జగన్ కు కూడా బాధ్యత లేదా అని ఆయన ప్రశ్నించారు. 

read more   ఆరేళ్ల తర్వాత మళ్లీ... జగన్ వల్లే సాధ్యం...: మంత్రి వెల్లంపల్లి

 సీమనుండే ఎన్నికైన సీఎం జగన్...  ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంతం వెనుకబడి ఉందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం కోసం విద్యార్థులు...హైకోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్థసారథి ప్రకటించారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి న్యాయం చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 

రైతు బంధు పథకం కింద కేంద్రం వేల కోట్లు ఇచ్చినా 20 శాతం రైతులకు కూడా పంచలేదని... రైతులకు దక్కాల్సిన సాయాన్ని సకాలంలో అందించకపోవడం రాష్ర్ట ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ర్ట ప్రభుత్వం రైతులకు అందించలేకపోవడం దారుణమని.. పెట్టుబడి సహాయం పంట అయిపోయిన తర్వాత ఇస్తారా.. ? అని ఎద్దేవా చేశారు. 

read more  ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వేడుకలకు సర్వం సిద్దం... ప్రభుత్వ కార్యక్రమాలివే

పత్తికొండలో టమోటా రైతులు గిట్టుబాటు లేక రోడ్లపై పడేసి వెళుతున్నారని... ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల పరిస్థితి ఇలాగే ఉంటోందన్నారు. రాజకీయ నాయకులు దళారులతో కుమ్మక్కై రైతులను నాశనం చేస్తున్నారని  పార్థసారథి ఆరోపించారు. 

విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు, మరీ ముఖ్యంగా రాయలసీమకు కేంద్రం ఎంతైనా సహాయం ఇచ్చేందుకు సిద్దంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని రాష్ర్ట ప్రభుత్వం అందిపుచ్చుకుని రైతులకు మేలు చేయాలని పార్థసారథి కోరారు.

click me!