
ఇంగ్లాండ్ వేదికన ప్రారంభమైన ప్రపంచ కప్ టోర్నీలోనే హైలైట్ నిలిచింది ఇండో పాక్ మ్యాచ్. దాయాది దేశాల మధ్య జరిగిన ఈ పోరు భారత్, పాక్ అభిమానులనే కాదు యావత్ క్రికెట్ ప్రియులను ఆకర్షించింది. దీంతో ఈ మ్యాచ్ భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ మ్యాచ్ ను చూడటానికి సామాన్య అభిమానులే కాదు సెలబ్రెటీలు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్ల భార్యలు, కుటుంబ సభ్యులు కూడా మాంచెస్టర్ మైదానంలో ప్రత్యక్షమయ్యారు. ఇలా ధోని భార్య సాక్షి, జీవాలు కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు.
అయితే మంచి బేబీ సిట్టర్ అన్న పేరున్న యువ క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ కు హాజరయ్యాడు. అయితే అతడు జీవాతో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తూ తెగ సందడి చేశాడు. ఈ క్రమంలో టీమిండియా విజయాన్ని అందుకున్న తర్వాత వారిద్దరు చాలా విచిత్రంగా సంబరాలు చేసుకున్నారు. ఇలా జీవాతో కలిసి సరదా సంబరాలు చేసుకుంటున్న వీడియోను పంత్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.
రిషబ్ పంత్, జీవాలిద్దరు అల్లరి చేయడంలో పోటీ పడ్డారు. ఇద్దరు ఒకరిని మించి మరొకరు గట్టిగా అరుస్తూ కాస్త వెరైటీ సంబరాలను జరుపుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే మ్యాచ్ ముగియగానే వీరి అల్లరిని మరింత పెంచి భారత్ విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇలా పంత్-జీవాతో కలిసి సరదాగా ఆడుకుంటున్న వీడియో నెటిజన్లకు, క్రికెట్ ప్రియులకు తెగ నచ్చడంతో వైరల్ గా మారింది.
ప్రపంచకప్ లీగ్ దశలో భాగంగా జరిగిన ఇండో పాక్ మ్యాచ్ మరోసారి టీమిండియాదే పైచేయిగా నిలిచింది. దాయాది పాకిస్థాన్ను భారత్ 86 పరుగులతో చిత్తుగా ఓడించి మరోసారి సత్తా చాటింది. ఇలా ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో తలపడ్డ ఏడుసార్లు భారత్ దే విజయం. ఈసారైనా టీమిండియాను ఓడించాలన్న పాక్ కల కలగానే మిగిలిపోయింది.