
ఐపీఎల్ లో తిరుగులేని జట్టు.. ఐదు సార్లు ఛాంపియన్.. లీగ్ లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ.. ఈ సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు సంబంధించిన వర్ణనలివి. కానీ 15 రోజులలో మాత్రం అంతా తలకిందులు.. ఒక్క విజయం సాధించినా చాలు అని ఆ జట్టు అభిమానులు కండ్లు ఖాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడి ఇకపై ఆడాల్సిన (9) మ్యాచులలో ప్రతి పోటీలో గెలిస్తేనే ఐపీఎల్-15 పై ఆశలు సజీవంగా ఉంటాయనే స్థితికి తెచ్చుకుంది ముంబై ఇండియన్స్. శనివారం లక్నోతో జరుగుతున్న కీలక పోరులో ఆ జట్టు తొలుత బౌలింగ్ కు రానుంది. కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేయనుంది.
ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-లక్నో సూపర్ జెయింట్స్ జరుగుతున్న మ్యాచ్ రోహిత్ సేనకు చాలా కీలకం. ఇప్పటికే ఐదు మ్యాచులు ఓడిన నేపథ్యంలో ఆ జట్టు సీజన్ లో ముందంజ వేయాలంటే ఈ పోటీలో తప్పక నెగ్గాల్సిందే. ఇక ఈ సీజన్ లో ఐదు మ్యాచులు ఆడిన లక్నో.. మూడింటిలో గెలిచి రెండు ఓడింది. గత మ్యాచులో రాజస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఆ జట్టు మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తున్నది.
కీలక మ్యాచ్ కోసం ముంబై ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. స్పిన్నర్ ఫాబెన్ అలెన్ జట్టులోకి వచ్చాడు. లక్నోలో కూడా ఒక మార్పు జరిగింది. గౌతమ్ స్థానంలో మనీష్ పాండే తిరిగి జట్టులోకి చేరాడు.
ఐపీఎల్ లో ఈ రెండు జట్లు తొలిసారి పోటీ పడనున్నాయి. కాగా ఐపీఎల్ లో లక్నో సారథికి ఐపీఎల్ లో వందో గేమ్.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబిన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్
లక్నో సూపర్ జెయింట్స్ : కెఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, అయుష్ బదోని, జేసన్ హోల్డర్ , కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్