
ఐపీఎల్ ప్రారంభానికి మరి కొద్దిగంటల్లో తెరలేవబోతోంది. ఈ మెగా లీగ్ లో మెరుపులు మెరిపించడానికి ఆటగాళ్లు తమ ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే టోర్నీలో ఇంకా తొలి బంతి కూడా పడకముందే పలువురు ఆటగాళ్లు ఆయా ఫ్రాంచైజీలకు షాకులిస్తున్నారు. దాదాపు అన్ని ఫ్రాంచైజీలూ ఈ షాకులకు బాధితులుగానే ఉన్నాయి. షాకులకు గురయ్యే టీమ్స్, షాకులిచ్చే ఆటగాళ్ల జాబితాను ఒకసారి చూద్దాం.
ఐపీఎల్ లో దాదాపు అన్ని జట్లలోనూ ఆటగాళ్లు ఉన్న దేశం సౌతాఫ్రికా. ఈ దేశం నుంచి వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఈ మెగా లీగ్ ఆరంభ మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నారు.
మనకే ఫస్ట్ షాక్..
వన్డే వరల్డ్ కప్ లో నేరుగా క్వాలిఫై కావడం కోసం సఫారీలు.. నెదర్లాండ్స్ తో రెండు వన్డేలు ఆడనున్నారు. మార్చి 31, ఏప్రిల్ 1న ఈ మ్యాచ్ లు జరుగుతాయి. వీటిలో గెలిస్తేనే సౌతాఫ్రికా.. వరల్డ్ కప్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఈసారి సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్.. ఎస్ఆర్హెచ్ సారథిగా ఉన్నాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్.. తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాజస్తాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు మార్క్మర్ అందుబాటులో ఉండడు. మార్క్రమ్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్, బౌలింగ్ ఆల్ రౌండర్ మార్కో జాన్సేన్ కూడా ఏప్రిల్ 7న జరిగే మ్యాచ్ లతో అందుబాటులోకి వస్తారు.
ఓపెనింగ్ పార్ట్నర్ లేకుండా రాహుల్..
లక్నో సూపర్ జెయింట్స్ లో సారథి కెఎల్ రాహుల్ కు ఓపెనింగ్ పార్ట్నర్ గా ఉన్న క్వింటన్ డికాక్ కూడా సౌతాఫ్రికా ప్లేయరే. డికాక్ లేకుండా రాహుల్.. కైల్ మేయర్స్ (విండీస్), దీపక్ హుడా లతో ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి.
గుజరాత్కూ..
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ జెయింట్స్ కు గత సీజన్ లో డేవిడ్ మిల్లర్ మంచి విజయాలు అందించాడు. కానీ ఈ సీజన్ లో అతడు శుక్రవారం జరిగే చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో అందుబాటులో ఉండటం లేదు.
చెన్నైదీ అదే బాధ..
దక్షిణాఫ్రికా బౌలర్ సిసంద మగల చెన్నై ఫస్ట్ మ్యాచ్ మిస్ అవుతాడు. ఆ జట్టు ఆల్ రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ కూడా లేటుగానే జట్టుతో కలుస్తాడు. శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ప్రస్తుతం న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. అతడు కూడా పలు మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు.
ఢిల్లీకీ..
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కీలక బౌలర్ అన్రిచ్ నోర్త్జ్ తో పాటు లుంగి ఎంగిడిలు ఢిల్లీ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండరు. ఈ ఇద్దరే గాక బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా స్వదేశంలో ఐర్లాండ్ తో సిరీస్ కారణంగా ఏప్రిల్ 5 తర్వాత అందుబాటులోకి వస్తాడు.
పంజాబ్ కు..
సౌతాఫ్రికా బౌలర్ కగిసొ రబాడా తో పాటు ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ కూడా పంజాబ్ ఆడే తొలి మ్యాచ్ కు దూరంగా ఉండనున్నారు. రెండో మ్యాచ్ వరకు వీళ్లు కలిసే అవకాశముంది.
ఆర్సీబీకి..
ఆర్సీబీ కీలక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నాడు. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఆ జట్టు.. కివీస్ తో మూడు టీ20లు ఆడుతుంది. ఇవి ముగిశాకే హసరంగ ఆర్సీబీతో కలుస్తాడు.
కోల్కతాకు..
కోల్కతా నైట్ రైడర్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తాత్కాలిక సారథి నితీశ్ రాణా జట్టును నడిపించనుండగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్ లు ఏప్రిల్ 5 తర్వాత ఐపీఎల్ కు ఎంట్రీ ఇస్తారు. వీరితో పాటు కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నాడు.