ఇండియా సిమెంట్స్ కంపెనీలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఎమ్మెస్ ధోనీకి అపాయింట్మెంట్ లెటర్... మరో చిచ్చు రేపిన లలిత్ మోదీ..
ఐపీఎల్ ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది బీసీసీఐ. అయితే ఈ ఐడియాకి ప్రాణం పోసిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోదీ మాత్రం ఆర్థిక నేరాల ఆరోపణలతో బీసీసీఐకి దూరమయ్యాడు. కొన్నేళ్లుగా సైలెంట్గా అజ్ఞాతంలో గడిపిన లలిత్ మోదీ, మహేంద్ర సింగ్ ధోనీ అపాయింట్మెంట్ లెటర్ని పోస్ట్ చేసి, పెను దుమారం రేపాడు..
మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ క్రికెటర్లలో ఒకటిగా ఉన్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా రూ.12 కోట్లు అందుకుంటున్న ధోనీ, వివిధ బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తూ వందల కోట్లు ఆర్జిస్తున్నాడు..
క్రికెటర్గా సక్సెస్ సాధించడానికి ముందు టికెట్ కలెక్టర్గా పనిచేసిన మహేంద్ర సింగ్ ధోనీకి, 2012లో ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా వచ్చిన ఆఫర్ లెటర్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు లలిత్ మోదీ. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమన్య సంస్థే ఈ ఇండియా సిమెంట్స్. 2012లో ధోనీని రూ.8.82 కోట్లకు రిటైన్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్..
‘చూస్తుంటే ఇండియాలో బీసీసీఐలో కొందరు ఓల్డ్ గార్డ్స్, రూల్స్ని ధిక్కరించడం కొనసాగుతూనే వస్తున్నట్టు ఉంది. ఇది నార్త్ బ్లాక్ పనే. నా అనుమానం ఏంటంటే ధోనీకి ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ దేనికి? అతను ఇప్పటికే వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అలాంటిది శ్రీనీ (ఎన్.శ్రీనివాసన్) ఎంప్లాయ్గా ఉండడానికి ఎందుకు ఒప్పుకున్నాడు. జనాలకు తెలియని ఇలాంటి కాంట్రాక్ట్రులు చాలానే ఉన్నాయి..’ అంటూ రాసుకొచ్చాడు లలిత్ మోదీ..
2012లో వచ్చినట్టు ఉన్న అపాయింట్మెంట్ లెటర్లో ధోనీకి మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేందుకు నెలకు రూ.43 వేల జీతం, ఫిక్స్డ్ డియరెస్ అలవెన్స్గా రూ.21,970, స్పెషల్ పేగా రూ.20,000, స్పెషల్ రెంట్ అలవెన్స్గా రూ.8,400, హెచ్ఆర్ఏగా రూ.20,400, స్పెషల్ అలవెన్స్గా మరో రూ.60,000, న్యూస్పేపర్, ఎడ్యూకేషన్ ఖర్చుల నిమిత్తం మరో రూ.175 చెల్లించేందుకు ఒప్పందం జరిగింది. దీన్ని ధోనీ అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు..
చెన్నై సూపర్ కింగ్స్లో మహేంద్ర సింగ్ ధోనీకి వాటా ఉందనేది చాలా రోజులుగా వినిపిస్తున్న వార్త. అయితే మాహీ మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ఒప్పుకోలేదు. సౌతాఫ్రికా20, మేజర్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల్లో సీఎస్కే ఫ్రాంఛైజీల తరుపున పనిచేయాలని కూడా ధోనీ భావించాడు. అయితే బీసీసీఐ అంగీకరించకపోవడంతో ఈ ఆలోచనను విరమించుకున్నాడు..
స్పాట్ ఫిక్సింగ్ కేసు కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురైంది చెన్నై సూపర్ కింగ్స్. ఆ సమయంలో ధోనీ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ధోనీ, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. అయితే ధోనీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా రిటైర్మెంట్ తర్వాత 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ధోనీ, మెంటర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే.