
బ్యాటింగ్కి స్వర్గధామంగా చెప్పుకునే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బౌలర్ల రాజ్యం నడుస్తోంది. తొలి రోజు మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఇన్నింగ్స్ రెండు సెషన్లలోనే ముగియగా... మూడో సెషన్లో ఆట మొదలెట్టిన శ్రీలంక, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేయగలిగింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 166 పరుగుల దూరంలో ఉంది లంక...
కుశాల్ మెండీస్ 2 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా 6 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన లహిరు తిరుమాన్నే కూడా బుమ్రా బౌలింగ్లో అయ్యర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
4 పరుగులు చేసిన దిముత్ కరుణరత్నేని తన స్పెల్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు మహ్మద్ షమీ. 24 బంతుల్లో ఓ ఫోర్తో 10 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వ, మహ్మద్ షమీ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించినా డీఆర్ఎస్ తీసుకున్న భారత జట్టుకు అనుకూలంగా ఫలితం వచ్చింది...
28 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. 8 బంతుల్లో ఓ ఫోర్తో 5 పరుగులు చేసిన చరిత్ అసలంక, అక్షర్ పటేల్ బౌలింగ్లో రవిచంద్రన్ అశ్విన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో ఏంజెలో మాథ్యూస్, నిరోషన్ డిక్వాలా కలిసి ఆరో వికెట్కి 35 పరుగుల భాగస్వామ్యం జోడించారు...
85 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన ఏంజులో మాథ్యూస్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో రోహిత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగు బంతులకు ఎంబూల్దేనియ ాను ఎల్బీడబ్ల్యూ అవుట్గా అప్పీల్ చేసిన టీమిండియా డీఆర్ఎస్ తీసుకోలేదు. అయితే రిప్లైలో బంతి వికెట్లను తాకుతున్నట్టు కనిపించడం విశేషం.
అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 59.1 ఓవర్లలో 252 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్ పూర్తిగా రెండు సెషన్లు కూడా సాగకపోవడం విశేషం. బ్యాటింగ్కి కష్టసాధ్యంగా మారిన పిచ్పై ఎంతో సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేసి,కెరీర్లో రెండో టెస్టు హాఫ్ సెంచరీ అందుకున్న శ్రేయాస్ అయ్యర్.. 92 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు.
మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రనౌట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హనుమ విహారి, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్కి 47 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 81 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన హనుమ విహారి, జయవిక్రమ బౌలింగ్లో వికెట్ కీపర్ డిక్వాలాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ధనంజయ డి సిల్వ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
లంచ్ బ్రేక్ సమయానికి 29 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది భారత జట్టు. లంచ్ బ్రేక్ తర్వాత 26 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్ను ఎంబుల్దేనియా క్లీన్ బౌల్డ్ చేశాడు. గత మ్యాచ్లో 175 పరుగులు చేసి నాటౌట్గా నిలిచిన రవీంద్ర జడేజా 14 బంతుల్లో ఓ ఫోర్తో 4 పరుగులు చేసి ఎంబూల్దేనియా బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు...
33 బంతుల్లో ఓ ఫోర్తో 13 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, ధనంజయ డి సిల్వ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 183 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
7 బంతుల్లో ఓ సిక్సర్తో 9 పరుగులు చేసిన అక్షర్ పటేల్, లక్మల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహ్మద్ షమీ 5 పరుగులు చేసి అవుట్ కాగా... శ్రేయాస్ అయ్యర్ 98 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేసి జయవిక్రమ బౌలింగ్లో భారీ షాట్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
148 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు, ఆఖరి నాలుగు వికెట్లకు 104 పరుగులు రాబట్టడం విశేషం. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబూల్డేనియా, ప్రవీణ్ జయవిక్రమ మూడేసి వికెట్లు తీయగా ధనంజయ డి సిల్వ రెండు, సురంగ లక్మల్ ఓ వికెట్ తీశాడు.