
1996లో వన్డే వరల్డ్ కప్ గెలిచి 2011 లో ఈ మెగా టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన శ్రీలంకకు భారీ షాక్ తాకింది. ఈ మాజీ ఛాంపియన్ లు ఈ ఏడాది భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే అంతకంటే ముందు క్రికెట్ పసికూనలతో కలిసి ‘క్వాలిఫై రౌండ్’ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న శ్రీలంక.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ను 2-0తో ఓడిపోవడంతో ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కివీస్ తో హమిల్టన్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో న్యూజిలాండ్.. 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. 41.3 ఓవర్లలో 157 పరుగులే చేసి ఆలౌట్ అయింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కివీస్.. 32.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో లంక.. వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు కోల్పోయింది. ప్రపంచకప్ లో ఆడాలంటే ఇప్పుడు లంక.. జూన్ నుంచి జింబాబ్వే వేదికగా జరిగే క్వాలిఫయర్స్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. శ్రీలంకతో పాటు జింబాబ్వే, నెదర్లాండ్స్, ఐర్లాండ్, వెస్టిండీస్, ఐసీసీ అసోసియేట్ దేశాలు క్వాలిఫై రౌండ్ ఆడతాయి. నెదర్లాండ్స్.. నేడు (మార్చి 31), రేపు (ఏప్రిల్ 1) సౌతాఫ్రికాతో రెండు వన్డేలు ఆడనుంది. ఈ రెండు వన్డేలలో గెలిస్తేనే సఫారీలు కూడా వరల్డ్ కప్ కు నేరుగా అర్హత సాధిస్తారు. లేదంటే సౌతాఫ్రికా పని కూడా గోవిందా గోవిందా. ఇక క్వాలిఫై రౌండ్ లో అర్హత (టాప్-3 జట్లు) సాధించిన జట్లే మిగిలిన 8 జట్లతో కలుస్తాయి. 44 ఏండ్ల తర్వాత లంక జట్టు క్వాలిఫై రౌండ్ ఆడుతుండటం గమనార్హం.
భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే వరల్డ్ కప్ కు ఇదివరకే భారత్ తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ లు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
ఇక లంక - కివీస్ మూడో వన్డే మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. మాథ్యూ హెన్రీ (3), షిప్లే (3), డారిల్ మిచెల్ (3) ల ధాటికి వణికిపోయింది. ఆ జట్టులో పథుమ్ నిస్సంక (57) టాప్ స్కోరర్. కెప్టెన్ దసున్ శనక (31) ఆదుకున్నా అతడికి అండగా నిలిచేవాళ్లు లేకపోవడంతో లంకకు నిరాశ తప్పలేదు. లక్ష్య ఛేదనలో కివీస్.. 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కానీ విల్ యంగ్ (86 నాటౌట్) హెన్రీ నికోల్స్ (44) లు ధాటిగా ఆడి కివీస్ విజయాన్ని ఖాయం చేశారు. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 2 నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. ఏప్రిల్ 2, 5, 8 తేదీలలో మూడు టీ20లు జరుగుతాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాతే ఐపీఎల్ లో వివిధ ఫ్రాంచైజీలకు ఆడే లంక ప్లేయర్లు తమ జట్లతో కలుస్తారు.