ట్రెండ్ సెట్ చేసిన ముకేశ్ అంబానీ...వార్షిక వేతనాన్ని వదులుకునేందుకు సిద్ధం...

By Sandra Ashok KumarFirst Published May 1, 2020, 11:59 AM IST
Highlights

కరోనా విసిరిన సవాల్ ఎదుర్కొనేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ట్రెండ్ సెట్ చేశారు. తద్వారా కార్పొరేట్ భారతానికి మార్గం చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనాన్ని వదులుకోనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సీనియర్లకు 30-50 శాతం వేతనంలో కోత విధిస్తారు. మరోవైపు వార్షిక వేతనం రూ.15 లక్షల లోపు ఉన్న వారికి ఊరట లభిస్తుంది.
 

ముంబై: కరోనా మహమ్మారి స్రుష్టిస్తున్న విలయతాండవం నేపథ్యంలో రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ అధినేత ముకేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని వదులుకునేందుకు సిద్ధం అయ్యారు. హైడ్రోకార్బన్స్ బిజినెస్ విభాగం సీనియర్ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధిస్తున్నట్టు రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే వార్షిక వేతనం రూ.15 లక్షల కన్నా తక్కువగా ఉండే ఉద్యోగుల వేతనాల్లో కోత ఉండదని రిలయన్స్ స్పష్టం చేసింది. తద్వారా సామాన్య ఉద్యోగులను రిలయన్స్ యాజమాన్యం మినహాయించింది.

రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ 2020-21 ఆర్థిక సంవత్సరంలో పూర్తి వేతనాన్ని వదులుకుంటున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిటల్ ఆర్ మెస్వానీ తెలిపారు. ఈ విషయాన్ని గత నెల 29వ తేదీన ఉద్యోగులకు రాసిన లేఖలో ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తెలిపారు. కాగా 2008-09 నుంచి 11 ఏళ్లుగా ముకేశ్ అంబానీ వేతనం ఏడాదికి రూ.15 కోట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే.

also read రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై‘కరోనా’దెబ్బ : క్యూ4లో తగ్గిన లాభం

అలాగే రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఇతర  సీనియర్  ఉద్యోగులు సహా రిఫరింగ్ బోర్డు డైరెక్టర్లు 30-50 శాతం వదులుకుంటారని ప్రకటించారు.  అంతేకాకుండా, మొదటి త్రైమాసికంలో సాధారణంగా చెల్లించే వార్షిక నగదు బోనస్, ఇతర ప్రోత్సాహకాల చెల్లింపును కూడా వాయిదా వేస్తున్నట్టు  తెలిపారు. హైడ్రోకార్బన్‌ వ్యాపార భాగంలో ఏడాదికి రూ.15 లక్షల వేతనం పొందే ఉద్యోగుల నికర వేతనంలో 10 శాతం కోత విధించనున్నారు. 

శుద్ధి చేసిన ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్ డిమాండ్ తగ్గడం వల్ల హైడ్రోకార్బన్స్ వ్యాపారం బాగా ప్రభావితమైంది. దీంతో ఖర్చుల తగ్గింపు అవసరమని మెస్వానీ పేర్కొన్నారు  కరోనా సంక్షోభ సమయంలో నిర్వహణ ఖర్చులు, స్థిర వ్యయాల తగ్గింపుపై  దృష్టి పెట్టామని, దీనికి అందరూ  సహకరించాలని ఉద్యోగులను కోరారు. 

కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ ముగిసిన వ్యాపార ప్రక్రియ పునర్వ్యవస్థీకరణకు,  డిజిటలీకరణతోపాటు తదుపరి ఉత్పాదకతను మెరుగుపరచడానికి అవకాశాన్నిఇచ్చిందని రిలయన్స్ చైర్మన్ తెలిపారు. కరోనాతోపాటు భారతదేశంలోపాటు యావత్ ప్రపంచం తీవ్రమైన  సవాళ్లను ఎదుర్కంటోందనీ పరిశ్రమలు, వ్యాపారం ప్రభావితమయ్యాయని ప్రకటించిన  రిలయన్స్  తాము కూడా దీనికి మినహాయింపు కాదని తెలిపింది. 
 

click me!