
న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారులకు ‘విద్యుత్ సెస్’ షాక్ తగులనున్నది. దేశీయంగా పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగం ప్రోత్సహించేందుకు సంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్ విధించాలని కేంద్రం యోచిస్తోంది.
ద్విచక్రవాహనాలు మొదలు కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల వరకు అన్నింటిపై సుమారు రూ. 500– రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనున్నది. ఈ వివాదాస్పద ప్రతిపాదన సహా పర్యావరణ అనుకూల వాహనాల వినియోగం ప్రోత్సహించడమే అసలు లక్ష్యం.
ఇందుకు అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించేందుకు గురువారం కేంద్ర ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. క్యాబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా సారథ్యంలో కార్యదర్శుల కమిటీ భేటీలో నీతి ఆయోగ్ చేసిన ‘ఫీబేట్’ ప్రతిపాదనను పరిశీలించనున్నట్లు వివరించాయి.
నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్తో పాటు భారీ పరిశ్రమలు, విద్యుత్, ఆర్థిక సర్వీసులు, రెవెన్యూ, పెట్రోలియం తదితర మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. కాలుష్య కారక వాహనాలపై సెస్ విధించడం, పర్యావరణ అనుకూల వాహనాలకు (ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాలు) సబ్సిడీ అందించడం ఈ ఫీబేట్ ప్రతిపాదన ఉద్దేశం.
దీని ప్రకారం ఉద్గారాలు వెలువరించే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ఐసీఈ)తో పని చేసే ద్విచక్ర వాహనాలపై సగటున రు. 500 మేర ఫీబేట్ విధించవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. త్రిచక్ర వాహనాలపై రూ. 1,000, కార్ల వంటి నాలుగు చక్రాల వాహనాలపై రూ. 12,000, బస్సులు.. ట్రక్కులు తదితర వాణిజ్య వాహనాలపై రూ. 25,000 మేర ఫీబేట్ విధించాలన్న ప్రతిపాదనలు ఉన్నట్లుపేర్కొన్నాయి.
రూ. 7,646 కోట్ల సమీకరణ.. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలుదారులకు ప్రోత్సాహకాలు అందించగలిగే దిశగా తొలి ఏడాదిలో అదనపు ఆదాయ మార్గాల ద్వారా రూ. 7,646 కోట్లు సమీకరించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభమై ఆ తర్వాత అయిదేళ్ల వ్యవధిలో ఐసీఈ వాహనాలపై సెస్ రూ. 7,646 కోట్ల నుంచి క్రమంగా రూ. 43,034 కోట్ల దాకా చేరొచ్చని సంబంధిత వర్గాల అంచనా. ఫీబేట్ ద్వారా సమీకరించిన నిధులను ఫేమ్ ఇండియా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగించనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనదారులకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సంప్రదాయ వాహనాలపై సెస్సులు విధించడం సరికాదని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎక్కువగా చిన్న కార్లు వినియోగించే భారత్ వంటి దేశంలో సబ్సిడీలతో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలమయంగా చేయాలన్న ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నదని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తేల్చి చెప్పారు.
విద్యుత్ వాహనాలపై రూ. 50 వేల దాకా సబ్సిడీ
నీతి ఆయోగ్ ప్రతిపాదనల ప్రకారం ఫీబేట్ అమలు చేసే తొలి ఏడాదిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు రూ. 25 వేలు, త్రిచక్ర వాహనాలకు రూ. 40వేలు, ఎలక్ట్రిక్ కారుకు రూ. 50 వేల సబ్సిడీ అందించనున్నారు. ఇది నేరుగా నగదు బదిలీ రూపంలో ఉంటుంది. కాలుష్యకారక వాహనాలపై సెస్ విధించి, పర్యావరణ అనుకూల వాహనాలు కొనుగోలు దారులకు రిబేటునిచ్చే విధానాన్నే ఫీబేట్గా వ్యవహరిస్తారు.
ఇప్పటికే నార్వే, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఫీబేట్ అమలు చేస్తున్నాయి. దేశీయంగా భారీ స్థాయిలో ఉండే ద్విచక్ర వాహనదారులపై ఫీబేట్ విధించడం వారిపై మరింత భారం మోపడమే అవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనపై గతంలో భారీ పరిశ్రమల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.