
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా మానిటరీ పాలసీని ఈరోజు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎంపీసీ, ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రేటు రెపోను యథాతథంగా ఉంచింది. రెపో రేటు 6.5 శాతం వద్దే ఉంది. ఎలాంటి మార్పు లేకుండానే సమీక్ష ముగిసింది. కాగా గతంలో ఆర్బీఐ రెపో రేటును వరుసగా 6 సార్లు పెంచింది.
బ్యాంకింగ్ రంగంలోని వైఫల్యాల కారణంగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం సమస్యగా మారిందని ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కాగా ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 0.25 శాతం నుంచి 6.50 శాతానికి పెంచింది.
అయితే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, అధిక వృద్ధి రేటును కొనసాగించేందుకు కీలకమైన పాలసీ రేటును 0.25 శాతం పెంచినట్లు ఆర్బీఐ అప్పట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆరుగురు సభ్యుల కమిటీ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
MPCలో RBI యొక్క ముగ్గురు అధికారులు, కేంద్ర ప్రభుత్వంచే నియమించబడిన ముగ్గురు బాహ్య సభ్యులు ఉంటారు. ఈ సమావేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల, అభివృద్ధి చెందిన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఇటీవల తీసుకున్న చర్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ మే 2022 నుండి రెపో రేటును 2.5 శాతం పెంచింది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం చాలా కాలం పాటు 6 శాతం కంటే ఎక్కువగానే ఉంది.