మాంద్యం మొదలైంది..ప్రపంచంలోని 50 శాతం ఉద్యోగాలు హుష్ కాకి అయ్యే చాన్స్..PWC సంచలన రిపోర్టులో వెల్లడి..

By Krishna AdithyaFirst Published Aug 19, 2022, 3:30 PM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో అనేక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. దిగ్గజ కంపెనీలు దాదాపు 50 శాతం ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉందని సంచలన నివేదిక బయటపడింది. 

కరోనా అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ మేఘాలు అన్ని రంగాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా 2007 మాంద్యం నాటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయా అని అంతా భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో చాలా కంపెనీలు బోనస్‌లను తగ్గించడం, జాబ్ రిక్రూట్ మెంట్ రద్దు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు తమ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మందిని తొలగించాలని ఆలోచిస్తున్నాయని తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ నివేదిక హెచ్చరించింది.

అమెరికాకు చెందిన  PwC 'Pulse: Managing Business Risks in 2022' సర్వే ప్రకారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు కనీసం 50 శాతం మంది ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో కంపెనీలు తమ భవిష్యత్తు కోసం ఉద్యోగుల నైపుణ్యాలను పెంచుకునేలా చర్యలు తీసుకుంటున్నాయని ఈ నివేదికలో పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా రిక్రూట్ మెంట్ విషయంలో కంపెనీలు ఉధృతంగా వ్యవహరించాయి. అయితే ఇఫ్పుడు మాత్రం ఆచితూచి అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. 

నివేదిక ప్రకారం ప్రపంచంలోని టాప్ కంపెనీలు 50 శాతం హెడ్‌కౌంట్‌ను తగ్గించుకునే పనిలో పడ్డారు. అలాగే 46 శాతం మందికి బోనస్‌లను తగ్గించడంతో పాటుగా, 44 శాతం మందికి ఆఫర్‌లను రద్దు చేస్తున్నారు" అని నివేదిక వెల్లడించింది.

మైక్రోసాఫ్ట్, మెటా (గతంలో ఫేస్‌బుక్) వంటి పెద్ద టెక్ కంపెనీలతో సహా యుఎస్‌లో జూలై నాటికి 32,000 మంది టెకీలను తొలగించారు. దీంతో టెక్ సెక్టార్‌ అధ్వాన్నంగా మారనుంది.  అటు మనదేశంలో, కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి,  25,000 కంటే ఎక్కువ మంది స్టార్టప్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు.

కొన్ని పరిశ్రమల్లో ఈ ముందస్తు జాగ్రత్తలు ఎక్కువగా ఉన్నాయని పీడబ్ల్యూసీ తన రిపోర్టులో తెలిపింది. మరోవైపు టెక్నాలజీ, మీడియా, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, తమ ఉద్యోగుల కొరతను పరిష్కరించడానికి ఆటోమేషన్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఎక్కువ ప్రయత్నిస్తాయని  PwC నివేదిక పేర్కొంది. అదే సమయంలో, హెల్త్‌కేర్ ఇతర పరిశ్రమల కంటే పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటీవల తొలగించిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవడంపై మరింత దృష్టి సారిస్తోంది.

మైక్రోసాఫ్ట్, గూగుల్ , ఆపిల్ కంపెనీలో మొదలైన కోతలు..

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. తమ రెవెన్యూలు తగ్గడంతో ఇప్పటికే యాపిల్ సంస్థ నూతన రిక్రూట్ మెంట్లను నిలిపివేస్తూ, ఏకంగా 110 రిక్రూటర్లను తొలగించింది. అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్ సైతం నూతన రిక్రూట్ మెంట్ నిలిపివేయడంతో పాటు, ఉద్యోగుల తొలగింపుపై దృష్టి కేంద్రీకరించాయి. 

మరోవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావం అటు మార్కెట్ డిమాండ్ పై కూడా పడే అవకాశం ఉంది. కంపెనీలు తమ మ్యాన్ పవర్ తగ్గించుకుంటే, ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. అప్పుడు అటు సేవా రంగంలోనూ, ఉత్పత్తి రంగంలోనూ డిమాండ్ కు తగిన సప్లై చెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దాంతో పాటు నిరుద్యోగిత పెరిగితే ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

click me!