
పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. వంట నూనెలు సలసలమంటున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా ధరలు మండుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా కస్టమర్లకు గుది బండలా మారాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.104 వరకు పెంచి కస్టమర్లకు షాకిచ్చాయి. అయితే ఈ పెంపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై చేపట్టాయి. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగలేదు.
ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.102.50 మేర పెరిగింది. ప్రతి నెలా 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తాయి. ఈ సమీక్షలో భాగంగానే నేడు (మే 1, 2022) కొత్త రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు విడుదల చేశాయి. ఈ రేట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.104 మేర పెంచుతున్నట్టు దేశంలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఐఓసీ పేర్కొంది.
ఈ నెల వేసిన భారంతో కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కో సిటీలో ఒక్కోలా ఉంది. ఢిల్లీలో పెరిగిన ధరతో సిలిండర్ కాస్ట్ 2,355 రూపాయలుగా ఉంటే.. కోల్కతాలో 2477.50 రూపాయలు ఉంది. ముంబైలో 2329.50లకు సిలిండర్ కోనాల్సి వస్తోంది. చెన్నైలో 2729 రూపాయలు వెచ్చించాలి. హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2563.5కు పెరిగింది. ఈ ధర అంతకుముందు రూ.2460గా ఉండేది. విశాఖపట్నంలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిడర్ ధర రూ.2321 నుంచి రూ.2413కు ఎగిసింది. ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ కాస్ట్ చూస్తే ఢిల్లీ, ముంబైలో 949.5, చెన్నైలో 965.50 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.