కరోనా మహమ్మారి ప్రభావం స్థిరాస్థి రంగం విలవిలలాడుతున్నది. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు, ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం భారీగా గిరాకీ తగ్గింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ అదే పరిస్థితి నెలకొంది.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి స్థిరాస్తి రంగానికీ చుక్కలు చూపుతోంది. ఈ దెబ్బతో కంపెనీలు, తమ విస్తరణ ప్రణాళికలు పక్కన పెట్టాయి. దీంతో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో లీజుకు తీసుకునే ఆఫీసు స్థలాల విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇది 73 శాతం పడిపోయిందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ ‘కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్’ తాజా నివేదికలో తెలిపింది.
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో కంపెనీలు 139.85 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కానీ జూన్తో ముగిసిన ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇది 37.15 లక్షల ఎస్ఎఫ్టీలకి పడిపోయింది.
కోవిడ్కు ముందు దేశ ఆర్థిక వ్యవస్థను మందగమనం వెంటాడటంతో పలు కంపెనీలు విస్తరణ ప్రణాళికలు పక్కనబెట్టాయి. అప్పటి నుంచే దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలాల లీజులు తగ్గిపోయాయి.
గత ఏడాది జనవరి-జూన్ మధ్య హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కోల్కతా నగరాల్లో కంపెనీలు 255.48 లక్షల ఎస్ఎఫ్టీల ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఈ సంవత్సరం జనవరి-జూన్ మధ్య అది 57 శాతం తగ్గి 110.75 లక్షల ఎస్ఎఫ్టీలకు పడిపోయిందని కుష్మాన్ అండ్ వేక్ ఫీల్డ్ అనే సంస్థ పేర్కొన్నది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హైదరాబాద్లో వివిధ కంపెనీలు 57.78 లక్షల ఎస్ఎఫ్టీల స్థలాన్ని ఆఫీసుల కోసం లీజుకు తీసుకున్నాయి. ఈ సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో అది 17.58 లక్షల ఎస్ఎఫ్టీలకు పడిపోయిందని ‘కుష్మాన్ అండ్ వేక్ఫీల్డ్’ పేర్కొంది.
also read
ముంబైలో నిరుడుతో పోల్చితే లీజులు పెరిగినా 16.45 లక్షల చదరపు అడుగులకే పరిమితమవడం గమనార్హం. ఇక ఢిల్లీ, బెంగళూరుల్లోనైతే కొత్త లీజుల సంగతి పక్కనబెడితే.. గతంలో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజులే రద్దయ్యాయి. చెన్నై, పుణె, కోల్కతా, అహ్మదాబాద్ల్లోనూ భారీగా క్షీణించాయి.
ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గతంతో పోల్చితే ఆఫీస్ స్పేస్ నికర లీజులు 8 ప్రధాన నగరాల్లో 73.4 శాతం క్షీణించినట్లు సీఅండ్డబ్ల్యూ తెలిపింది. ఈసారి 37.15 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజులే జరిగాయని పేర్కొన్నది. గతేడాది ఏప్రిల్-జూన్లో 139.85 లక్షల చదరపు అడుగుల లీజులు జరిగాయి.
ఈ ఏడాది జనవరి-మార్చితో పోల్చినా 49.5 శాతం తక్కువగా నమోదైనట్లు తేలింది. కరోనా దృష్ట్యా బడా కార్పొరేట్లు, కో-వర్కింగ్ సంస్థలు వ్యాపార విస్తరణను వాయిదా వేయడమే ఇందుకు కారణమని సీఅండ్డబ్ల్యూ తెలిపింది. ఈ ఏడాది జనవరి- జూన్ మధ్య 57 శాతం దిగజారి 110. 75 లక్షల చదరపు అడుగులకు ఆఫీస్ స్పేస్ లీజులు పరిమితమయ్యాయి.
నిరుడు జనవరి-జూన్లో ఇవి 255.48 లక్షల చదరపు అడుగులుగా ఉన్నాయి. అయితే అన్లాక్ ప్రక్రియ మొదలైనందున ఈ ద్వితీయార్ధంలో ఆఫీస్ స్పేస్కు కొంతమేర డిమాండ్ పెరుగవచ్చునని సీఅండ్డబ్ల్యూ ఇండియా, ఆగ్నేయాసియా ఎండీ అన్షుల్ జైన్ వ్యక్తం చేశారు.
జూన్లో పుంజుకున్న నియామకాలు
లాక్డౌన్ సడలింపులతో కంపెనీల్లో కొత్త కొలువుల నియామకాలు జోరందుకున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్లో నియామకాలు 33 శాతం పెరిగాయని నౌకరీ.కామ్ తెలిపింది. ఈ ఏడాది మే నెలలో 910గా ఉన్న కొలువుల నియామకాలు జూన్ నెల్లో 1,208కు పెరిగాయి. అయితే గత ఏడాది జూన్తో పోలిస్తే మాత్రం నియామకాలు 44 శాతం పడిపోయినట్టు నౌకరీ డాట్ కామ్ పేర్కొంది.