ఇదేం సమాఖ్య స్ఫూర్తి: ఫైనాన్స్ కమిషన్ రూల్స్ మార్పుపై మన్మోహన్

By Siva KodatiFirst Published Sep 15, 2019, 12:23 PM IST
Highlights

ఆర్థిక సంఘం సూచనల్లో మార్పులపై తుది నిర్ణయం తీసుకునే ముందు సీఎంల అభిప్రాయం తీసుకోవాల్సిందేనని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం సరి కాదని పేర్కొన్నారు.

ఆర్థిక సంఘం సూచన నిబంధనల్లో మార్పులు చేయడానికి ముందు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుండేదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

15వ ఆర్థిక సంఘం సూచన నిబంధనలను ఈ ఏడాది జూలైలో మోదీ సర్కార్ మార్చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం ఒంటెత్తు పోకడను మన్మోహన్ తప్పుబట్టారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈ తరహా విధానాలతో రాష్ర్టాల ప్రయోజనాలు దెబ్బ తింటాయని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. 

శనివారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆర్థిక సంఘం సూచన నిబంధనల్లో మార్పులకు సీఎంల అభిప్రాయ సేకరణ తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రాష్ర్టాలతో సంప్రదింపులతోనే ఈ ప్రక్రియలు జరుగాలని అన్నారు. 

కేటాయింపుల్లో మిగులు నిధులను రక్షణ, అంతర్గత భద్రతలకు వినియోగించేలా కమిటీ తప్పనిసరిగా సూచించాలని కేంద్రం 15వ ఆర్థిక సంఘం సూచన నిబంధనలను మార్చింది. అలాగే వచ్చే నెల 30 నాటికి కమిటీ తమ నివేదికను సమర్పించాల్సి ఉండగా, ఈ గడువును నవంబర్ 30కి మార్చారు.

click me!