
విద్యార్థులు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలంటే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) అంశాలపై దృష్టి పెట్టాలని గూగుల్ డీప్మైండ్ CEO, నోబెల్ విజేత డెమిస్ హస్సబిస్ స్పష్టం చేశారు.
ఇటీవల లండన్లో నిర్వహించిన SXSW ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, “ఈ సిస్టమ్స్ ఎలా రూపు దిద్దుకున్నాయో అర్థం చేసుకోవాలంటే గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ వంటి ప్రాథమికాలను తెలుసుకోవడం కీలకం” అని పేర్కొన్నారు.
హస్సబిస్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు AI సాధనాలను ఉపయోగించకపోతే, ఉద్యోగాలు సంపాదించే పోటీలో నిలువలేరని హెచ్చరించారు. వచ్చే 5 నుండి 10 ఏళ్లలో టెక్నికల్ నైపుణ్యాలున్నవారికి AI ఆధారిత ఉద్యోగాలు రూ.లక్షల్లో సంపాదన అందిస్తాయని ఆయన అంచనా వేశారు.
AI ప్రభావాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్తో ఆయన పోల్చారు. మనుషులు మార్పులకు తగినట్లుగా మారుతుంటారని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా అందిపుచ్చుకుంటారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పాఠశాలల విద్యకే పరిమితంగా కాకుండా విద్యార్థులు నూతన AI టూల్స్ను స్వయంగా ఉపయోగించాలని హస్సబిస్ సూచించారు. “నేను ప్రస్తుతం విద్యార్థిని అయితే తాజా AI సాధనాలన్నిటినీ నేర్చుకొని వాటితో అనేక ప్రయోగాలు చేసే వాడినన్నారు. వాటిని ఉపయోగించే ఉత్తమ మార్గాల కోసం అన్వేషించేవాణ్ణి” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం 40 దాటిన వాళ్లంతా ఇంటర్నెట్ ప్రపంచమంతా పెరగడాన్ని చూశారని, అదే విధంగా నేటి పిల్లలు AI డవలప్ మెంట్ ని చూస్తూ, అందిపుచ్చుకుంటూ ఎదుగుతారని హస్సబిస్ అభిప్రాయపడ్డారు. కోడింగ్ వంటి పనుల కోసం ఇప్పటికే మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు AI సాధనాలను అమలులోకి తీసుకువస్తున్నాయని తెలిపారు.
గత నెల గూగుల్ I/O డెవలపర్ కాన్ఫరెన్స్లో హస్సబిస్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ కలిసి మాట్లాడుతూ “AI 2030 నాటికి మానవ మేథస్సుకు సమానమైన సామర్థ్యాన్ని సాధించగలదని” అంచనా వేశారు. ఇది విద్యార్థులు తక్షణమే AI నేర్చుకోవడంలో యాక్టివ్ గా ఉండాల్సిన అవసరాన్ని చూపిస్తోందని అభిప్రాయపడ్డారు.